విజయవాడ కల్తీ మద్యం ఘటన సంచలనాలు కలిగించేలా ఉంది. కల్తీ మద్యం ఘటనపై పోలీసులు నిందితుల వేట కొనసాగిస్తూనే దర్యాప్తు వేగవంతం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు విష్ణు ఆస్తుల వివరాలనూ సేకరిస్తున్నారు.
మల్లాది విష్ణు ఆస్తులు కూడా జప్తు చేసుకుంటారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి
మల్లాది విష్ణు ఆస్తులు కూడా జప్తు చేసుకుంటారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న ఎక్సైజ్ అధికారుల జాబితా సిట్ సభ్యుల చేతికి చిక్కింది.
మాజీ MLA, విజయవాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఘటన జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు.
ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. కల్తీగా ఏ రసాయనం కలుపుతున్నారు. అది ఎక్కడ నుంచి తెస్తున్నారు. ఇక్కడే కలిపారా ఇంకెక్కడైనా కలిపారా.. అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాల్సి ఉంది.
ఈ కేసులో చిక్కు ముళ్లు వీడాలంటే విష్ణుని విచారించడం చాలా ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. లడ్డా నేతృత్వంలో సిట్ విష్ణును విచారించేందుకు ప్రశ్నావళి కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.
విష్ణు ఆచూకీపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఉంటూ.. హైకోర్టులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని కొందరంటున్నారు. వరంగల్లో బెజవాడకు చెందిన పార్టీ నేత అతిథి గృహంలో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. కేసులో కీలకంగా మారిన విష్ణు ఆచూకీ లభిస్తే కానీ ఈ కేసు ఓ కొలిక్కి రాదు.