తమిళనాడులో గత కొంత కాలంగా రాజకీయ పరంగా ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఎన్నో రాజకీయ మార్పులు సంభవించాయి. పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ మద్య జరిగిన యుద్దంలో అనుకోకుండా శశికళ జైలుకు వెళ్లడంతో ఆమెకు నమ్మిన బంటు అయిన పళని స్వామికి తమిళనాడు సీఎం పదవి దక్కేలా చేసింది. తర్వాత మళ్లీ రాజకీయ మార్పులు సంబవించాయి..సీఎం పళని స్వామి ని ఎంతగానో నమ్మిన శశికళ ను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించి పెద్ద షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం పన్నీరు సెల్వం, సీఎం పళని స్వామి ఒకటయ్యారు. మరోవైపు స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ ఏకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళనాట మరో కొత్త ప్రచారం కొనసాగుతుంది. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి మృత్యుముఖంలో ఉన్నారంటూ వస్తున్న వదంతులను ఆ పార్టీ నేతలు నిర్ద్వంద్వంగా ఖండించారు.
ఈ వదంతులు పూర్తిగా నిరాధారమని, వాటిని నమ్మవద్దని ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలు తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని.. మరోవైపు అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విషమించిందంటూ వదంతులు వ్యాపించడంతో తమిళనాడులో హైఅలర్ట్ విధించారు.
డీజీపీ రాజేంద్రన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ఎస్పీలకు హై అలర్ట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాకపోతే కరుణానిధి తనను చూడటానికి వచ్చిన వారిని ఆయన నవ్వుతూ రిసీప్ చేసుకుంటున్నారు.
నేను కూడా ఆయనను చూడ్డానికే వెళ్తున్నాను' అని మంగళవారంనాడు విలేఖరులతో బాలు మాట్లాడుతూ చెప్పారు. కరుణానిధి కుమార్తె కనిమొళి సైతం తన తండ్రి చాలా బాగున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగా అవసరం లేదని ట్వీట్ చేశారు. 93 ఏళ్ల కరుణానిధి గత ఆగస్టులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు.