కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా టెలికంశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన 2జీ స్పెక్ట్రం కేటాయించడంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక దాఖలు చేసింది. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ స్పష్టం చేసింది. దీనిపై సీబీఐ రెండు కేసులు, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఒక కేసు నమోదు చేశాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్కాం కేసులో పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కీలక నిందితులైన డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళి, మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజాలను నిర్దోషులుగా ప్రకటించింది. వీరిద్దరితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 15 మందిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ దాఖలు చేసిన రెండు కేసులలో మొదటి కేసులో ఎ.రాజా, కనిమొళి, టెలికంశాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్ద్ బెహ్రా, ఎ.రాజా మాజీ ప్రత్యేక కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిని నేరస్థులుగా చేర్చారు.
రిలైన్స్ టెలికాం, స్వాన్ టెలికాం, యునిటెక్ వైర్లెస్ సంస్థలు విచారణకు హాజరై సాక్ష్యం చెప్పాయి. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయించడంలో ప్రభుత్వానికి రూ.30,984 కోట్ల ఆదాయానికి గండి పడిందని ఛార్జ్షీటులో నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆరేళ్లకు పైగా సాగిన విచారణ గత ఏప్రిల్ 26న ముగిసింది. దీనితో డిసెంబర్ 21న తీర్పు వెలువరించనున్నట్టు ఢిల్లీ సీబీఐ కోర్టు డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించింది.
గురువారం తీర్పు సందర్భంగా కనిమొళి, రాజా సహా నిందుతులందరూ కోర్టుకు హాజరయ్యారు. ఈ స్కాంకు సంబంధించి సీబీఐ, ఈడీలో వేర్వేరుగా కేసులు పెట్టాయి. పటియాలా హౌస్ కోర్టు తీర్సుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చెన్నైలోని కనిమొళి ఇంటి వద్ద, డీఎంకే కార్యాలయం వద్ద సందడి నెలకొంది.