వైసిపికి సంబంధించి విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టిక్కెట్టు వంగవీటి రాధాకృష్ణకు లేనట్లేనా ? అందరికీ ఇపుడదే అనుమనం మొదలైంది. ఎందుకంటే, ఈరోజు మధ్యాహ్నం పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. సెంట్రల్ టిక్కెట్టు విషయంలో పార్టీలో రెండు రోజుల పాటు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సెంట్రల్ టిక్కెట్టు ఇవ్వటం లేదని రాధాకు ఎవరు చెప్పారో తెలీదు. ఆవిషయం ఎలా బయటకు పొక్కిందో కూడా తెలీదు. కానీ రచ్చయితే అంతా ఇంతా జరగలేదు.
ఈరోజు అంబటి మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులకు కేటాయించాలని కొందరు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు సందర్భంగా కలిసినపుడు కోరినట్లు చెప్పారు. బ్రాహ్మణులకైతే సెంట్రల్ లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అడిగిన తర్వాత పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. అందుకే రాధాను ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఆలోచిస్తోందని కూడా చెప్పారు. రాధాకు ఈస్టు నియోజవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పార్టీ నాయకత్వం అటువంటి నిర్ణయం తీసుకుందన్నారు. అంబటి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వంగవీటి రాధాకు విజయవాడ తూర్పు నియోజకవర్గమే ఖాయమైందన్న విషయం అర్దమైపోయింది.
అందుకు తగ్గట్లే రాధాను మచిలీపట్నం లోక్ సభ సీటులో కానీ విజయవాడ ఈస్టు అసెంబ్లీ లో కానీ పోటీ చేయమని జగన్ సూచించిన విషయం నిజమే అని స్పష్టమైంది. మరి రాధా ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే, సెంట్రల్ నియోజకవర్గంలోనే పోటీ చేయటమన్నది రాధా బాగా ప్రిస్టేజిగా తీసుకున్నట్లు కనబడుతోంది. జగన్ చెప్పినట్లు ఈస్టు నుండి పోటీ చేయటం ఇష్టం లేకపోతే అసలు పోటీ నుండే దూరంగా ఉండాలి. లేకపోతే పార్టీకి రాజీనామా చేసేయాలి. అయితే పార్టీకి రాజీనామా చేస్తే ఏమవుతుంది ? టిడిపిలో చేరలేరు. జనసేనలో చేరితే ఉపయోగం ఉండదు. అందుకే రాధా కూడా ఓపిగ్గా ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. మరేం చేస్తారో చూడాలి.