వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు జంప్ చేస్తున్నారా ? వీరి చేరికకు ముహూర్తం ఖరారు అయ్యిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు టాప్ లీడర్లు జనసేనలో చేరనున్నారా ? అంటే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో సీట్లు రాని వారందరూ జనసేన గూట్లోకి జంప్ చేసేస్తున్నారు. నిన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో వైసీపీ సమన్వయకర్తగా పని చేసిన పితాని బాలకృష్ణకు వైసీపీ టిక్కెట్ రాకపోవడంతో ఆయన జనసేనలోకి జంప్ చేసి ఆ పార్టీ టిక్కెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఇదే లిస్ట్లో ఏపీలో మరో ఐదుగురు టీప్ లీడర్ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ జీవీ.హర్షకుమార్, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు, విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీనియర్ చలమలశెట్టి రామేష్బాబు సైతం జనసేనలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వసంత్ కుమార్ ఉంగుటూరు నుంచి, హర్ష కుమార్ అమలాపురం ఎంపీగానూ, రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు ఎమ్మెల్యే లేదా బాపట్ల ఎంపీగానూ పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక తోట త్రిమూర్తులు ఎలాగూ రామచంద్రాపురంలోనే పోటీ చేస్తారు. ఆయన గతంలో 2009లోనూ అక్కడే ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కొణతాల అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారా ? లేదా ? అసెంబ్లీ బరిలో ఉంటారా ? అన్నది చూడాలి. ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ, వైసీపీ నుంచే గాకా గతంలో ప్రధాన పార్టీల్లో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రాజకీయ నాయకులు సైతం జససేనలోకి జంప్ చేసి వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు. తమ పార్టీలో కేవలం కొత్త రక్తాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ఇతర పార్టీల్లో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వారిని చేర్చుకోవడం ఎంత వరకు సమజసం అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. మరి దీనికి పవన్ ఎలాంటి ఆన్సర్ ? ఇస్తాడో చూడాలి.