సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరుతుంది. రెండో విడతలో ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 38 లోక్సభ స్థానాలకు, 18 శాసనసభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉదయమే ఓటు వేశారు... చెన్నై సెంట్రల్ పార్లమెంట్ పరిధిలోని స్టెల్లా మేరీస్ కాలేజీలోని పోలింట్ స్టేషన్కు వచ్చిన సూపర్ స్టార్.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు తమిళ హీరో విజయ్.. ఎలాంటి హడావిడి లేకుండా చెన్నై నగరంలో నీలంకిరిలోని పోలింగ్ స్టేషన్కు వెళ్లి అందరితో పాటు క్యూలో చాలా సేపు నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ సాధారణ పౌరుడిలా ఓటు వేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సినీయర్ నాయకుడు పి. చిదంబరం శివగంగా నియోజకవర్గంలో, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని పేనంపేటలో గల ఎస్ఐఈటీ కళాశాల పోలింగ్ కేంద్రంలో అదేవిధంగా డీఎంకే లోక్సభ అభ్యర్థి కనిమొళి చెన్నై ఆళ్వార్పేట పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
కర్ణాటకలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) నాయకులు దేవేగౌడ, ఆయన సతీమణి కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హసన్లోని పాదువలహిప్పి పోలింగ్ కేంద్రంలో దేవేగౌడ దంపతులు ఓటేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన సతీమణితో పాటు కుమారుడు నిఖిల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిఖిల్ మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం దేవేగౌడ తన సీటును త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదని దేవేగౌడ ప్రకటించారు.
కాగా, లోక్సభ ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుంచి ప్రకాశ్రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఇవాళ ఉదయం బెంగుళూరులోని ఓ పోలింగ్ బూత్ వద్ద ప్రకాశ్రాజ్ ఓటేశారు. దేశవ్యాప్తంగా 95 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ రెండవ దశ పోలింగ్ జరుగుతున్నది. కర్నాటక మంత్రి హెచ్డీ రేవన్నా.. హసన్ నియోజకవర్గంలో ఓటేశారు. ముందుగా ఆయన ఓ ఆలయాన్ని సందర్శించి.. ఆ తర్వాత ఓటేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్లారు. కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, ఆయన భార్య కనిక పరమేశ్వరి తుముకూరులో ఓటేశారు. ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ.. శేషాద్రిపురం పోలింగ్ స్టేషన్లో ఓటేశారు.