ఏపీ సీఎం జగన్ ఎక్కడికక్కడ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా, కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెపుతున్నా ఆ పార్టీ నేతలు మాత్రం ఏదో ఒక వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ అటు ప్రభుత్వం పరువుతో పాటు జగన్ను ఇరుకున పెడుతూనే ఉన్నారు. వీరి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వాలు వాటిని మీడియాలో హైలెట్ చేస్తూ ప్రభుత్వం, జగన్పై బరద జల్లే ప్రక్రియ బాగా చేస్తున్నాయి.
తాజాగా కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎంపీగా అంతర్జాతీయంగా ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మాధవ్ను ఆహ్వానించారు. అక్కడ మాధవ్ ఇంకా తన పోలీస్ ఉద్యోగం నుంచి బయటకు రాలేదన్నట్టుగా వ్యవహరించారు. అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గానే దూకుడుగా ఉండేవారు.
తాజాగా కియా కార్ల ప్రారంభోత్సవంలో మాధవ్ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేదిగా ఉంది. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు తమ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసేలా ఉంది. కియాలో స్థానికేతరులకే ఎక్కువుగా ఉద్యోగాలు ఇచ్చింది నిజం. అయితే ఆ విషయంలో అంతర్జాతీయ మీడియా ముందు అసందర్భంగా అసహనం వ్యక్తం చేయడంతో కియా యాజమాన్యం కూడా షాక్ అయ్యింది.
ఇది పారిశ్రామికవేత్తల్లోనూ జగన్ ప్రభుత్వంపై రాంగ్ నిగ్నల్స్ పంపింది. మాధవ్ ప్రవర్తించిన తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే... కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది నిబంధన. ఒకవేళ ఇప్పటికే పెట్టిన కంపెనీల్లో ఎక్కువ మంది స్థానికేతరులు ఉన్నా ఇకపై చేసే రిక్రూట్మెంట్స్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అక్కడితో ఆగని మాధవ్ ముఖ్యమంత్రి జగన్ కు చెప్పి కియా మెడలు వంచిస్తా... ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు అని అనడంతో పారిశ్రామికవేత్తలు కూడా షాక్ అవుతున్నారు. జగన్ నుంచి ఇప్పటికే మాధవ్కు పిలుపు వచ్చిందని.. మాధవ్ దూకుడు నేపథ్యంలో జగన్ ఆయన మెడలు వంచి కంట్రోల్లో పెడతారని కూడా వైసీపీ వాళ్లే సీరియస్గా చెపుతున్నారు. మంత్రుల పేషీల్లో అవినీతి మచ్చ ఉన్న వారిని తొలగించమని చెప్పినా... అలాగే కొనసాగిస్తున్న కొందరు మంత్రులను మందలించిన జగన్ గోరంట్ల మాధవ్ చేసిన తప్పు అంత ఈజీగా క్షమించరనే తెలుస్తుంది.