నేడు చూసుకుంటే ప్రతి ఇంటికి వచ్చే కరెంట్ బిల్లు మామూలుగ ఉండటం లేదు కొందరికి వందలల్లో బిల్లు వస్తుంటే, మరికొందరికి వేయిలు, లక్షల్లో బిల్లులు చెల్లించే వారు ఉన్నారు. ఇలాంటి వారికో శుభవార్త. ఇక నుండి మనకు ఖర్చు అవ్వగా మిగిలిన కరెంటును అమ్ముకుని అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చూ. ఎన్నాళ్లనుండో వాడుకుంటున్న కరెంటుకు బిల్లులు మనమే చెల్లిస్తున్నాం ఇక ఆ కాలనికి స్వస్తి పలికే రోజులొచ్చాయి.. గత కొద్ది రోజులుగా వినియోగదారుడే కరెంట్ను విద్యుత్ సంస్థలకు విక్రయించే పరిస్థితి వచ్చింది. ఇదేంటని ఆశ్చర్యంగా ఉందా ఇది నిజమండి బాబు..
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), నెడ్క్యాప్లు ఈ వెసులుబాటు కల్పించాయి. ఇందుకు గాను ‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు పర్యావరణహిత సౌర విద్యుత్ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వినియోగదారుల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను రాయితీపై ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంస్థలు కృష్ణా జిల్లాలో మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం 648 మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 631 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 444 గృహాలకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చారు. మరో 138 కనెక్షన్లు పరిశీలనలో ఉన్నాయి.
మొత్తం 444 కనెక్షన్లలో 147 సూర్యశక్తి పథకం కింద మంజూరయ్యాయి. ఇకపోతే విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తయిన సోలార్ విద్యుత్ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్ విద్యుత్ యూనిట్కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి చెల్లిస్తుంది. యూనిట్ల నమోదుకు వీలుగా నెట్ మీటర్లు కూడా అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్ విద్యుత్ను విక్రయిస్తున్నారు. యూనిట్కు రూ.5.58 చొప్పున పవర్ గ్రిడ్ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది.
ఇలా ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యావిద్యుత్సరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. ఇంకేముంది సూర్యుని ద్వారా వచ్చే వేడితో విద్యుత్ తయారుచేసుకుని మనం వాడుకున్నంతగా వాడుకుని మిగతాది అమ్మి అదనంగా నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చూ. ఇంతే కాకుండా మనింటి కరెంట్ బిల్ కట్టే బాధ కూడా ఉండదు. అందుకే పలువురు ఈ పధకం పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు.