పిజ్జా ప్రియులకు ఇది శుభవార్తే మరి. ఇకపై ఇండియన్ రైల్వే పిజ్జా డెలివరీ రంగంలోకి అడుగుపెట్టే దిశగా ఆలోచిస్తోంది. అవును. సరుకు రవాణా ఆదాయాన్ని మరింత పెంచేందుకు ఇకనుండి డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను అనుకరిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వస్తువులను అనుకున్న సమయంలో రవాణా చేయడంలో ఆలస్యం గాని జరిగితే దానికి తగిన పరిహారం గంటల ప్రాతిపదికన రైల్యే శాఖ ఇవ్వనుందట.

ముందుగా వస్తువుల పంపిణీకి రైల్వే ఓ నిర్ణీత సమయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమయానికి వస్తువుల పంపిణీ గాని జరగకపోతే మాత్రం ప్రతి గంటకి ఇంత చొప్పున అని వినియోగదారులకు పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి ఢిల్లీకి సరుకులు రవాణాకు గరిష్టంగా 3 రోజులు అనగా ఇంచుమించుగా 72 గంటల సమయం పడుతుంది అనుకుంటే, ఈ నిర్ణిత సమయం లోపు సరుకులను పంపిణీ చేయకపోతే, గడువు ముగిసిన ప్రతి గంట ఆలస్యానికి రైల్వే ఇంత చొప్పున అని పరిహారం చెల్లించబోతోందన్నమాట.

అయితే, పరిమిత రంగాలపై మాత్రమే ఈ పద్దతిని అమలు చేయాలని, 2021 నాటికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తైన తర్వాత క్రమంగా దీనిని పెంచుకుంటూ పోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారట. అంతేకాదు దీనిని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి పియూష్ గోయల్ తన బృందాన్ని కోరినట్లు సమాచారం.

ముఖ్యంగా బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్ కంపెనీల రవాణా దృష్టిని ఆకట్టుకోవడానికే ఈ రవాణా విధానం అనుసరించబోతున్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇది రానున్న కాలంలో ఆదాయం పరంగా జాతీయ రవాణాదారునికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సరుకు రవాణా డెలివరీ మోడల్ కోసం ఆటో సెక్టార్, ఇ-కామర్స్ కంపెనీ‌లతో పాటు ఫార్మా సెక్టార్లను ఆకర్షించే దిశగా కూడా రైల్వే శాఖ పావులు కదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: