కడప జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే, మంత్రి అంజాద్ బాషా, విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మంత్రి శంకరనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే, మంత్రి రంగనాథరాజుల పేర్లు ముందు వరుసలోనే అవుట్ లిస్టులో ఉన్నాయి. వీరిలో రంగనాథ రాజుకు సీనియర్. ఆయనకు ఎన్నో ఆశలతో జగన్ మంత్రి పదవి ఇచ్చినా దానిని నిలబెట్టుకోలేకపోయారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జగన్ సన్నిహితుడు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కేబినెట్ బెర్త్ కోసం కాచుకుని ఉన్నారు. దీంతో రంగనాథ రాజును తప్పించడమే మిగిలి ఉంది.
ఇక పుష్ప శ్రీవాణి పనితీరు అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఆమెకు బదులుగా ఎస్టీ ఎమ్మెల్యేల్లో పీడికల రాజన్నదొర, తెల్లం బాలరాజు, కళావతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మైనార్టీ కోటాలో అంజాద్ బాషాను తప్పిస్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా పేరు లైన్లో ఉంది. ఇక పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణ పూర్తిగా చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితే ఉందంటున్నారు. పైగా జిల్లా రాజకీయాల్లో ఆయన వేగలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో ఆయన్ను తప్పించి ఆ ప్లేస్లో రెడ్డి సామాజిక వర్గంలో దూకుడుగా ఉండే నేతకు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ నలుగురితో పాటు మరికొంత మంది మంత్రులను కూడా తప్పించనున్నారు.