ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి సంబందించిన అన్ని రకాల సేవలను ఒకే చోటికి తీసుకోచ్చే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక సరికొత్త యాప్ తీసుకొస్తోంది.. దీనిలో టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్ వంటివి చేసుకోవచ్చు. మొత్తంగా 12 నుంచి 15 రకాల సేవలను ఒకే యాప్లో లభించేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ను ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఆన్లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్లకు మూడు వేర్వేరు యాప్లున్నాయి. ఇక ఈ సేవలన్నీ ఒకే యాప్లో ఉంటాయి. సెంట్రల్ కమాండ్ సెంటర్, ట్రాకింగ్ డివైజులు, సర్వర్, ఈ పోస్ యంత్రాలు కోసం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.70 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిజిటలైజేషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కు కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం 10 నుండి 20 కోట్ల రూపాయల సాయం అందించనుంది. వచ్చేనెలలో టెండర్లు పిలవనుండగా.. యాప్ ద్వారా బుక్ అయ్యే ఒక్కో టికెట్కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్కు లభించే వీలుందని అంచనా వేస్తున్నారు. పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలుకొని దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్లో బుక్ చేసుకోవచ్చు. ప్రతి బస్సు ట్రాకింగ్ ఉంటుంది.. ఏ సమయానికి బస్టాండ్ వస్తుందో చూసుకొని ప్రయాణికులు వెళ్లేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉన్న బస్సుల ట్రాకింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. డ్రైవర్లు, కండక్టర్లు వద్ద ఉండే టిమ్ల స్థానంలో ఆండ్రాయిడ్ ఇ-పోస్ యంత్రాలిస్తారు. దీనిద్వారా ప్రతి టికెట్ కొనుగోలు అందులో నమోదవుతుంది. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ ద్వారా వివరాలు అప్డేట్ అవుతాయి. ఈ యాప్ వస్తే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.