అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా మారుస్తూ ప్రభుత్వం నిన్న పొద్దుపోయాక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పురపాలక చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు రానున్నాయి.


అలానే పాలకొల్లు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, కందుకూరు మున్సిపాలిటీల్లోకి కూడా సమీప గ్రామపంచాయితీలను విలీనం చేస్తూ నిన్న రాత్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. అంతేకాక అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలు మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్సు ప్రకారం నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, చినకాకాని, ఆత్మకూరు, కాజా, నూతక్కి, చిన్న, పెద్ద వడ్లమూడి, రామచంద్రాపురం మొత్తం 11 గ్రామాలు మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు.


ఇక తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, వడ్డేశ్వరం, కుంచంపల్లి, కొలనుకొండ, తదితర ప్రాంతాలను విలీనం చేశారు.  ఇక పాలకొల్లు, తాడేపల్లి, గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని 5 గ్రామాలు, తణుకు, భీమవరం సమీపంలో ఉన్న 4 గ్రామాలు విలీనం చేశారు. బాపట్ల పరిధిలోని 8 గ్రామ పంచాయితీలను బాపట్లలో,  కందుకూరు పరిధిలో 10 గ్రామాలను కందుకూరులో విలీనం చేశారు. రాష్ట్రంలో 6 చోట్ల ఇలా  పట్టణ ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆర్దినెన్స్ జారీ చేసింది.  విజయవాడ రూరల్ పరిధిలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమల కుదురు తదితర ప్రాంతాలను కలుపుతూ  వైఎస్సాఆర్ తాడిగడప అనే పేరు పెట్టారు. దీని మీద ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన ప్రాంతాల్లో రాజధాని ప్రాంతం కూడా ఉండడంతో దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: