భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ త‌మ పార్టీని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, ఇష్టారాజ్యంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ పార్టీకి మ‌రో షాకివ్వ‌నున్నారు. హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జ‌రుగుతున్న‌రోజే టీఆర్ ఎస్ అభ్య‌ర్థి వాణీదేవికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి బీజేపీకి షాకిచ్చారు. బీజేపీ తెలంగాణ శాఖ తీరుతోనే ఈ నిర్ణ‌యం తీసుక‌న్నాన‌న్న జ‌న‌సేనాని నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఎవ‌రికి వారే..
‌నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తున్న వేళ... జనసేన కూడా అక్కడ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇరుపార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా ఉప్పు నిప్పులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ త‌రుణంలోనే జ‌న‌సేన ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి క‌మిటీని ప్రకటించడం ఈ వార్త‌ల‌కు ఊతమిస్తోంది. టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వ‌డంపై బీజేపీ రాష్ట్ర‌శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతునివ్వడమేంటని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులుంటే.. తమ దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు.

అంత‌రం పెర‌గ‌డానికి అర‌వింద్‌, అరుణ లాంటివారే కార‌ణం
ప‌వ‌న్‌, సంజ‌య్ వ్యాఖ్య‌ల‌నుబ‌ట్టి ఇరుపార్టీల మ‌ధ్య బాగా అంత‌రం పెరిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, డీకే అరుణ‌లాంటి నేత‌లు జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై చేసిన చుల‌క‌న వ్యాఖ్య‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను నొచ్చుకునేలా చేశాయ‌ని భావిస్తున్నారు. జనసేనతో అసలు తమకు పొత్తే లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల స‌మ‌యంలో ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. డీకే అరుణ కూడా అలాగే మాట్లాడారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ... ఓట్లు చీల్చవద్దన్న ఉద్దేశంతో పవన్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం పోటీ నుంచి తప్పుకుని త్యాగాలు చేయడం ఆపాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెగ‌దెంపులే స‌రైన నిర్ణ‌య‌మ‌ని జ‌న‌సేనాని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: