ఏపీ సీఐడీ పోలీసులు తనను కస్టడీలో క్రూరంగా హింసించారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దేశమంతా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. తనను చిత్రహింసలు పెట్టారంటూ తన కాళ్ల ఫోటోలను జత చేస్తూ ఆయన దేశంలోని ఎంపీలకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఏపీ సీఐడీ పోలీసులు తన ఫోన్ అనధికారికంగా లాక్కున్నారని.. దాని నుంచి ఇతరులకు వాట్సప్ మెస్సేజ్‌లు పెడుతున్నారని ఢిల్లీ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఈ కంప్లయింట్‌పై సీఐడీ స్పందించింది. రఘురామరాజు చెబుతుందంతా అబద్దమని చెబుతోంది. ఆయన చేసేదంతా దుష్ప్రచారమేనంటోంది. తాము నిబంధనల ప్రకారమే సెల్‌ఫోన్‌ సీజ్‌ చేశామని.. సెల్‌ఫోన్‌ నంబరుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరస్పర విరుద్ధ సమాచారమిస్తున్నారని ఎదురుదాడి చేస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజును అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఓ వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయని సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన సెల్‌ఫోన్‌ను అనధికారికంగా జప్తు చేసినట్టు, ఆ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ సందేశాలు వెళ్తున్నట్టు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీ సీఐడీ విభాగం క్లారిటీ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశామని.. సీఐడీ న్యాయస్థానానికి కూడా నివేదించామని తెలిపింది. సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో రఘురామకృష్ణరాజు చెప్పిన వివరాలకు.. ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలకు పొంతన లేదంటోంది సీఐడీ. అసత్య ఆరోపణలతో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదును పట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఐడీ అంటోంది.

అరెస్టు సమయంలో తనది ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ సెల్‌ఫోన్‌ అని, 90009 11111 ఎయిర్‌టెల్‌ నంబరుతో ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారని సీఐడీ అంటోంది. ఆ సమయంలో ఆ సెల్‌ఫోన్‌ ఏ నంబరు సిమ్‌తో ఉందనే విషయం దర్యాప్తు అధికారికి తెలియదు కాబట్టి రఘురామకృష్ణరాజు చెప్పిందే నమోదు చేశామని వివరించింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 9000922222 అనే సిమ్‌ నంబరుతో ఉన్న తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని చెప్పారు.

కానీ.. సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. దీన్ని బట్టి వాట్సాప్‌ సందేశాలు వెళ్లాయని ఆయన చెబుతున్న సిమ్‌ కార్డు నంబర్‌తో ఉన్న సెల్‌ఫోన్‌ సీఐడీ పోలీసుల వద్ద లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒప్పుకున్నట్టేనని సీఐడీ అంటోంది. మరి సీఐడీ చెబుతున్నదీ లాజిక్కే.. ఈ దెబ్బతో రఘురామ చిక్కుల్లో పడినట్టేనా..?


మరింత సమాచారం తెలుసుకోండి: