జగన్ కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లుగా ఆమె వ్యక్తిగత కారణాలతో విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. వాస్తవానికి ఆమె లేనప్పుడు ఆమె భర్త అన్నీ అయి కార్యక్రమాలు నడిపించారు. కానీ, కీలకమైన పనులు మాత్రం నిలిచిపోయాయని.. పెద్ద ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. తమకు ఏమీ మేలు జరగలేదన్న ఆరోపణలు రావడం.. వైద్య సదుపాయాలు లేక.. పలువురు మహిళలు మరణించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
వీటిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో మంత్రి అలెర్ట్ అయ్యారు. విషయం వాస్తవానికి సీఎం వరకు వెళ్లింది. అయితే.. ఆమె వ్యక్తిగత కారణాలతో ఇంటికే పరిమితమైన నేపథ్యంలో మరో మంత్రికి బాధ్యతలు ఇవ్వాలని బావించినా.. పార్టీలో ఆమె చేసిన సేవలను గుర్తించిన జగన్... మౌనం వహించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దగ్గర తనకున్న మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె సుదూర ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రజలను పలకరిస్తున్నారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంపైనా దృష్టిపెట్టారు.
అయితే.. ఈ హఠాత్పరిణామంతో ఆమెకు ప్రజల్లో మార్కులు పడుతున్నాయా? లేక.. ఏం జరుగుతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం దగ్గర ఓకే.. కానీ, ప్రజల మధ్య మాత్రం.. మంత్రికి మార్కులు పడాలంటే.. ఖచ్చితంగా మరింత శ్రమపడాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్ల గ్యాప్ కారణంగా.. మంత్రితో స్థానికులకు ఉన్న రిలేషన్ తగ్గిన మాట నిజమేనని..ఆమె అనుచరులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఆమె పాల్గొన్న ప్రాంతాల్లో జనాలు కూడా పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. మరి పుంజుకున్నా.. ప్రజల నుంచి మార్కులు పడడం లేదనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.