తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా తయారవుతున్నా.. సీనియర్లు మాత్రం వదిలి వెళ్లడానికి ఇష్టపడటంలేదు. అప్పటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు తలోపార్టీ చూసుకున్నా.. వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది ఇప్పటికీ కాంగ్రెస్ కి లాయల్ గానే ఉన్నారు. అయితే వీరంతా రేవంత్ రెడ్డి నియామకంతో బాగా హర్ట్ అయ్యారు. టీడీపీనుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై పెత్తనం చలాయించడం వీరికి సుతరామూ ఇష్టంలేదు. అందుకే పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ.. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు.
వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా షర్మల పార్టీవైపు చూస్తారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఎన్నికలకింకా రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో ఎవరూ తొందరపడి షర్మిల వైపు వెళ్లలేదు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కల్లోలం మొదలైంది. దీంతో ముందుగానే వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధంతో, ఆయన కుమార్తె షర్మిల పెట్టిన పార్టీలోకి వెళ్తారని చెబుతున్నారు. అదే నిజమైతే.. రేవంత్ నియామకం కాంగ్రెస్ అధిష్టానం చేసిన పెద్ద తప్పు అవడం ఖాయం. రేవంత్ దూకుడు కాంగ్రెస్ కి కలిసొచ్చి తెలంగాణలో పార్టీ బలపడితే మాత్రం.. తొందరపడి పార్టీ వీడిన సీనియర్లు పశ్చాత్తాప పడాల్సిందే.