గతంలో పృథ్వీ కూడా ఆడియోలో వినిపించిన గొంతు తనది కాదని వివరణ ఇచ్చారు. విచారణ చేపట్టాలన్నారు, తనపై కుట్ర జరిగిందని, తనను ఇరికించారని అన్నారు. కానీ పార్టీ పెద్దలు కూడా ఆ మాటలు నమ్మలేదు. ఆయన్ను పక్కకు తప్పించారు, పార్టీకి అంటిన మరకను కడిగేసుకున్నారు. మరిప్పుడు అంబటి, అవంతి విషయంలో పార్టీ ఏంచేస్తోంది. కనీసం విచారణకు ఆదేశించిందా..? లేదా వారిని వ్యక్తిగతంగా వివరణ అడిగిందా..?
సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లకు మూలాలు రాబట్టడం పోలీసులకు పెద్ద పనేం కాదు. మరి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ విషయంలో ఆ పోస్ట్ లు పెట్టినవారిని కనిపెట్టారా లేదా అనేది తేలలేదు. గతంలోనే అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మరి ఆయన కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తేలాలి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా తనపై కుట్ర జరిగిందంటున్నారు కానీ, ఎవరు చేసి ఉంటారో చెప్పలేకపోతున్నారు.
వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న అంబటికి ఆడియో వ్యవహారం తలనొప్పిగా మారింది. అటు అవంతి మంత్రి పోస్ట్ లో ఉన్నా, దాన్ని కొనసాగించుకునే క్రమంలో ఇలాంటి ఆడియో విడుదల కావడంతో ఆయన కూడా తల పట్టుకున్నారు. ఆరోపణలు వచ్చీ రాగానే పృథ్వీని సాగనంపిన పార్టీ.. ఎమ్మెల్యే, ఎంపీపై మాత్రం సాఫ్ట్ కార్నర్ తో ఉందనే విషయం అర్థమవుతోంది.