వాళ్ళు చేసే ప్రతీ మోసాన్ని భరించి రైతు ఆగం అయిపోతూనే ఉన్నాడు. ఒకప్పుడు రైతు అందరికీ తిండి అందించాలని పండించేవాడు, నేడు వ్యాపారం చేస్తున్నాడు. మార్కెట్లో ఏది ఎక్కువ రేటు ఉంటె అదే విపరీతంగా పండించి, దానిని అమ్మాలి అనుకుంటున్నాడు. అయినా చివరికి రోడ్డుపాలు చేసుకుంటున్నాడు. ఒక్కటే పంట వేసి నష్టపోవద్దని, ఎక్కువ పంటలు ఉన్న భూమిలోనే వేసి లాభాల బాట పట్టవచ్చని ఒకపక్క వ్యవసాయ శాస్త్రవేత్తలు(పంటలు పండించి, అనుభవంతో చెప్పేవాడు) చెపుతున్నారు. అలాంటి తోటి వారి స్వానుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇలా మూసపోసినట్టే పంటలు వేసి, నష్టపోవడం ఎంతవరకు సమంజసమో రైతులే తేల్చుకోవాలి.
ఇకనైనా రైతులు నేతల అబద్దాలు విని మోసపోకుండా, తోటి రైతు శాస్త్రవేత్తలతో సేంద్రీయంగా పంటలు పండించి, అదికూడా అందరికీ అవసరమైన అనేక పంటలు వేయడం ద్వారా అన్ని పంటలకు సామాన్య ధరలకు వినియోగదారులకు వారే స్వయంగా అమ్మడం ద్వారా లాభాలు చూడవచ్చు. అలా కాకుండా, ఏదో పంటకు డిమాండ్ ఉందని దానినే అందరూ పండించేసరికే దాని రేటు కూడా పడిపోయి, అంత కస్టపడి పండించిన పంటను రోడ్లపాలు చేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది. అందరూ చూస్తూనే ఉంటారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, పారేసే బదులుగా దానిని పచ్చళ్ళు పెట్టి అమ్ముకోవచ్చు లేదా టమాటా సాస్ చేసి అమ్మవచ్చు లేదా ఎండబెట్టి టమాటా పౌడర్ లా కూడా తయారుచేసి అమ్మవచ్చు. ఇన్ని మార్గాలు మరిచి, ధర మాత్రమే నమ్మి రోడ్లపై పారేస్తే, మిమ్మల్ని పిచోళ్లు అంటారు తప్ప, సమాజం జాలికూడా పడదు. ఇకనైనా మారండి. మీరు కొద్దిగా ఆలోచిస్తే, ప్రస్తుతం మీకు సూపర్ మార్కెట్ ఉంది, ప్రతి పంటను రకరకాలుగా అమ్ముకోవచ్చు. దారులు ఎన్నో ఉన్నా, రోడ్డె మీ దారి అయితే, అది మీ ఇష్టం..! ప్రస్తుత పరిస్థితులు రైతే రాజు కావచ్చు అన్నట్టు ఉన్నాయి. దానిని వాడుకుంటే బాగుపడొచ్చు, కాస్త ఆలోచించండి.