భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని గోదావరి నది ఉప్పొంగడంతో తీర ప్రాంతాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి పంటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదకు తోడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేయడంతో నిర్మల్ జిల్లా బాసర మొదలు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ వేలాది ఎకరాల పంటలు నీటి పాలయ్యాయి. బ్యాక్ వాటర్ హజీపూర్, జన్నారం, చెన్నూరు, కోటపల్లి , వేమనపల్లి మండలాల్లో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. సుందరశాల, నర్సక్కపేట, పొక్కూరు, చింతలపల్లి గ్రామాల్లో అధిక నష్టం జరిగింది. అటు కోటపల్లి మండలంలోని కొల్లూరు, రాంపూర్, దేవులవాడ గ్రామాల్లో 10 వేలకుపైగా ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంట నీట మునిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మూడుసార్లు పంటలు నీటి పాలయ్యాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు విలపిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో కొమురం భీం జిల్లాలో45 వేల ఎకరాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో 15వేల ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 17 వేల ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటికీ స్పందించలేదు. అయినా రైతులు మరోసారి సాగు చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు పంటలు వరద పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.