ప్రస్తుతం హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రజల మనిషి గా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఈటల రాజేందర్ ను గెలిపించుకునేందుకు మరోసారి హుజురాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రసంగాలు చేశారు బండి సంజయ్. అంతేకాదు హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచి తీరుతాడు అంటూ అటు కెసిఆర్ కి సవాల్ సైతం విసిరారు. అయితే ఇలా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్కు వరుసగా సవాళ్ళు విసురుతూ ఉండటంపై కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఎన్నికకు ప్రతిపక్షాలు సవాల్ చేయడం సరికాదు.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం అంటూ కవిత చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలు తమ సవాళ్లతో అటు రాజకీయాలను ఎటు వైపు తీసుకెళుతున్నాయో కూడా అర్థం కావడం లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రాజకీయాల్లో సీఎం కేసీఆర్ గెలిచినన్ని సార్లు ఎవరూ కూడా గెలవలేదు అంటూ కవిత చెప్పుకొచ్చారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారు కదా అయితే ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా.. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికను కూడా బీజేపీ సవాలుగా తీసుకుంది కదా అంటూ కవిత వ్యాఖ్యానించారు.