రానున్న మంత్రి వర్గ విస్తరణ జగన్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా కొత్త మంత్రలెవ్వరన్నది ఇప్పటిదాకా తేలలేదు. అలా అని సీనియర్లను కొనసాగిస్తారా అంటే అదీ లేదు అని తెలుస్తోంది. ఇప్పుడు దసరా పండుగ సంతోషాలు కన్నా ఉత్కంఠతే ఎక్కువ గా వెన్నాడుతోంది.బొత్స లాంటి లీడర్లు తమకు పదవులు కొనసాగించినా, కొనసాగించకపోయినా వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారు. మోత్కుపల్లి కూడా ఇదే వాయిస్ వినిపించారు. ప్రభుత్వ పెద్ద ఆదేశానుసారం తాము నడుచుకుంటామని తమ విధేయతను మరో సారి వినిపించారు. ఈ నేపథ్యంలో కొత్త వారికి ఛాన్స్ ఉన్నా దీని వల్ల పార్టీ బలోపేతం అవుతుందని మాత్రం తాను చెప్పలేనని రెబల్ ఎంపీ ఆర్ ఆర్ ఆర్ అంటున్నారు. పార్టీ బలోపేతానికి , మంత్రివర్గ విస్తరణకు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వచ్చే ఎన్నికలకు ఈ టీంతోనే వెళ్తామని, కనుక ఆశావాహుల జాబితా ఎలా ఉన్నా సమర్థులకూ, జిల్లాలలో మంచి పేరున్న వారికే ఈ దఫా పదవి ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే పదవుల పరుగులో చాలా మంది ఉన్నా దాసన్న లాంటి వారు ఈ పరుగు నుంచి తప్పుకున్నా, కొత్తగా వినిపించే పేర్లు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.
శ్రీకాకుళం నుంచి దాసన్నను తప్పించి సీతారాంకు పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. స్పీకర్ గా గత సభా సంప్రదాయాలను అనుసరించి కోన రఘుపతి (డిప్యూటీ స్పీకర్) కు సభాపతి స్థానం కేటాయించాలని భావిస్తున్నారు. అదేవిధంగా దాసన్న సోదరుడు, సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గంలో బెర్తు కన్ఫం అని తెలుస్తోంది. అదేవిధంగా విజయనగరం నుంచి కోలగట్ల పదవి అడుగుతున్నారు. పదవి ఇచ్చినా ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె శ్రావణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టు పడుతున్నారు. అదేవిధంగా విజయనగరం నుంచి బొత్స కొనసాగే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి. ఇక నెల్లూరు నుంచి అనీల్ ను తప్పించేయాలని భావిస్తున్నారు. తూగో పగోలలో కమ్మ, కాపు సామాజికవర్గాల సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీమ నుంచి తన మనుషులను కొందరిని తప్పించి, సమర్థులకు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచే కాకుండా బలిజ, బోయ సామాజికవర్గాలకూ క్యాబినెట్ లో చోటు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్కో సామాజికవర్గం నుంచి ఒక్కో మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఎస్టీల నుంచి పాలకొండ ఎమ్మెల్యే
విశ్వసరాయ కళావతి కోరుకున్నా అది జరగని పని.
ఇక ఎస్సీలకు సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన హోం మంత్రి ఎలానూ ఉన్నారు కనుక ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వవచ్చు. విజయనగరం నుంచి పాముల పుష్ప శ్రీవాణిని తప్పించడం ఖాయం. ఆమె స్థానంలో పీడిక రాజన్న దొర అనే సాలూరు ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో చోటు దక్కవచ్చు. విడుదల రజనీకి కూడా క్యాబినెట్ లో చోటు ఉంటుందని కొందరు ఆశిస్తున్నారు. అలానే అంబటి రాంబాబు కు కూడా అమాత్య పదవి వరించేందుకు వీలుంది. వివాదాస్పద కొడాలి నానిని తప్పించడం ఖాయం. వల్లభనేని వంశీకి పదవి ఇచ్చేందుకు వీలుంది. కానీ దీనిపై ఎటువంటి స్పష్టతా లేదు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినా పరిశ్రమల శాఖ చూస్తున్న మేకపాటి గౌతమ్ ను అలానే ఉంచుతారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డిని తప్పిస్తారు. రోజా రెడ్డికి ఛాన్స్ ఉందో లేదో కూడా చెప్పలేం. ఇవన్నీ హైపోథిటికల్ వెర్షన్స్ మాత్రమే! వీటిలో కొన్నే సాధ్యం. ఆశావహులు కొందరికి ఈ సారి మంత్రి పదవులు వచ్చేందుకు వీలున్నా వారిలో కొందరు అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ చెప్పిన మాట వినలేదు కూడా! ఇవన్నీ జగన్ ప్రాధాన్యాంశాలుగా పరిగణనలోకి రానున్నాయి.