తెలంగాణ అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరుగుతున్న సందర్భంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రాల హక్కులను హరించడంలో కాంగ్రెస్, బీజేపీ లు దొందు దొందే అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా..ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ.. అక్కడి నుంచి వచ్చేవి తక్కువని వివరించారు. రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడానికి కేంద్రం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ గ్రామాలను ప్లాన్ యువర్ విలేజ్ పేరుతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో చేర్చేందుకు ‘మన దగ్గర ఒప్పుకోరు- కోర్టుకు వెళ్తారు’ అని చెప్పారు. పల్లె - పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా 2 లక్షల 33వేల పోల్స్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఓ పంచాయితీ సెక్రటరీని నియమించినట్టు పేర్కొన్నారు.