ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగంలో సంక్షోభం నెలకొంది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా కావడం లేదు. దీంతో విద్యుత్‌ కోతలు తప్పని పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని ముందే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం అబ్బే పెద్దగా సమస్య లేదంటూనే  సమస్య తీవ్రతను అంగీకరిస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్‌లో బొగ్గు కొరత ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కమ్ లు పనిచేస్తున్నాయని చెబుతున్నారు.


ఈ సందర్భంగా ట్రాన్స్‌కో చెబుతున్న కొన్ని వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఏపీ జెన్ కో ప్లాంట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని ఏపీ ట్రాన్స్‌కో ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని.. కానీ.. ప్రస్తుతం కొరత కారణంగా సెప్టెంబరు నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా  అయ్యిందని తెలిపింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా నే ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం తలెత్తిందని వివరించింది ట్రాన్స్‌కో.


ఏపీలో నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ కు 15-20 రూపాయల వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని ట్రాన్స్‌కో చెబుతోంది. బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరాను చేయగలుగుతున్నామని తెలిపింది. ఏపీలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లుగా ఉన్నా.. అవసరమైనంత  విద్యుత్ ఉత్పత్తి కావటం లేదు.


ఏపీలో 8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే..  బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి మాత్రం కావటం లేదు. 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని ట్రాన్స్‌కో చెబుతోంది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని ట్రాన్స్‌కో వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: