హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగం అనే మరో ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం అభ్యర్థులు నామినేషన్ వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు పెద్దగా ఇవ్వలేదన్న కారణంగా ప్రభుత్వంపై అసహనంతో నామినేషన్ వేశారు. సర్కారుకి నిరసన తెలుపుతూ పోటీలో నిలిచారు. సొంత రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిందన్న కారణం చూపుతూ ప్రజల్లోకి వెళ్తామని నిరుద్యోగులు అంటున్నారు. వాస్తవానికి 200 మంది నిరుద్యోగులు పోటీలో ఉందామని భావించారు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం, స్థానికంగా వారికి బలపరిచే వారు దొరక్కపోవడంతో అంత పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయలేకపోయారు. అయితే బరిలో ఉన్నవారు నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రచారం చేస్తామని అంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిన తర్వాత తెర మీదకు పీవీ నరసింహారావు జిల్లా పేరు వచ్చింది. హుజురాబాద్ను జిల్లా చేస్తారని, దానికి పీవీ పేరు పెడతారని వార్తలు వినిపించాయి. పీవీ పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఓ అభ్యర్థి నామినేషన్ వేశాడు. హుజురాబాద్ను జిల్లా చేయాల్సిందే అని, దానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడం లేదన్న కారణం చూపుతూ మరికొందరు నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. నల్ల చట్టాలు రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్ వేశామని అంటున్నారు.
మొత్తంమీద హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో అనేక సమస్యలు తెరమీదకు వచ్చాయి. పలు డిమాండ్ల సాధన కోసం నామినేషన్లు దాఖలు అయ్యాయి. కనీసం ఇలా పోటీ చేయడం ద్వారా అయినా సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు అవుతుందని, భవిష్యత్ లో అయినా పరిష్కారం దొరుకుతుందని ఆయా సమస్యల పరిష్కారం కోసం ఉపఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు భావిస్తున్నారు.