సామాజిక ఉద్యమ కారుడు, విప్లవ రచయిత వరవర రావు ప్రస్తుత ఆరోగ్య స్థితి ఏంటి? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ? ఎక్కడ ఉన్నారు ? ఈ ప్రశ్నలన్నీ విప్లవోద్యమాలతో, విప్లవ రచయితలతో ప్రత్యక్ష, పరోక్ష పరిచయం ఉన్న వారి మదిలో వచ్చిన ప్రశ్నలు. మావోయిస్టు అగ్రనేత ఆర్కె కన్నుమూశారని తెలియగానే విప్లవ సానుభూతి పరులంతా ఒక్క సారిగా వరవర రావును తలుచుకున్నారు. ఆయన ఆరోగ్య విషయం పై ఒకరికొకరు వాకబు చేసుకున్నారు. ముంబయి హై కోర్టు ఆయన బెయిల్ ను పొడిగించిందని తెలుసుకుని కొంత ఉపశమనం పొందారు.
ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవర రావు తో పాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. వీరు మావోయిస్టులతో కలసి కుట్ర చేశారనేది ప్రధాన ఆరోపణ. వీరిపై ఉన్న అభియోగాలలో ముఖ్యమైనవి ఏమిటంటే.. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్ అల్లర్లలో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టులతో సంబంధాలు, కలిగి ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారు వంటి అభియోగాలు న్నాయి.
భారత సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాలతో వీరిని కొన్ని రోజులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. వరవర రావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. తరువాత కొన్నాళ్లకు అక్కడి నుంచి నవీ ముంబయిలోని తలోజా జైలుకు తరలించారు.
వరవర రావు వయసు ప్రస్తుతం 83 సంవత్సరాల పైచిలుకే.
గత ఏడాది ఫిబ్రవరిలో 22న న్యాయ స్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిలు లో పేర్కోన్న నిబంధన ప్రకారం ఆయన తిరిగి ఈ ఏడాది సెప్టంబర్ 5వ తేదీ తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లాలి. దీంతో వరవర రావు కు అభిమానంగా ఉండే లాయర్లు కొందరు ముంబయి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై అఫిడవిట్ దాఖలు చేశారు. వరవర రావుకు కంటి సమస్యతో పాటు పార్కిన్ సన్ సమస్యతో బాధ పడుతున్నారని కోర్టుకు తెలిపారు. మోదడులో రక్త ప్రరణ సరిగా లేని విషయాన్నికోర్టు దృష్టికి తెచ్చారు. అంతే కాక ఆయనకు ముంబైలో వైద్యం చేయించు కునేందుకు ఎక్కవ మొత్తం వెచ్చించాల్సి వస్తోందని, అంత ఆర్థిక భారాన్ని మోసే స్థితిలో కుటుంబ సభ్యులు లేరని తెలిపారు. హైదరాబాద్ లో వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. షరతులను సడలించి బెయిల్ ను పొడిగించాలని కోరారు. జస్టిస్ కొత్వాల్, జస్టిస్ నితిన్ ల నేతృత్వం లోని ధర్మాసం వరవర రావు తరఫు న్యాయవాదుల వాదనలను ఆలకించింది. బెయిల్ ను ఈ నెల 28 వరకూ పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.