ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఒక్కొక్కటిగా మూసి వేయించి, కార్పొరేట్ సంస్థలపై ఆధారపడడం అన్నది మనకు మాత్రమే చెల్లు. వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం కానీ ఉత్పత్తికి సంబంధించి కావాల్సినంత బొగ్గును కలిగి లేవు. ఈ సమయంలో అదాని కంపెనీలకు మాత్రం దిగుమతి చేసుకున్న బొగ్గు నిల్వలతో డిమాండ్ కు తగ్గ రీతిలోనే విద్యుత్ ను ఉత్పత్తి చేసి అమ్ముకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంతో జెఎన్ డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్, టాటా పవర్ కో, అదానీ సంస్థలకు ఉన్న ముందు జాగ్రత్త మనకు లేకపోవడమే శోచనీయం.
అవును! విద్యుత్ సమస్యలపై ఎప్పటి నుంచో కేంద్రం రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో కేంద్రాన్ని జాతీయ మీడియా కూడా హెచ్చరిస్తోంది. అధిక వర్షాల కారణంగానే బొగ్గు ఉత్పత్తి ఆశించిన రీతిలో లేదని కేంద్రం చెబుతున్నా ఇవన్నీ వినేందుకు బాగుంటాయి కానీ ఆచరణలో మీరు చేయాల్సిన పనులేవీ చేయడం లేదని మీడియా వర్గాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ సంక్షోభంలో మోడీ వాటా కూడా ఉంది. జగన్ వాటా కూడా ఉంది. ఎవ్వరో ఒక్కరినే నిందించలేం. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలుకు మార్గం వెతికినా కూడా అది కూడా అంత వేగంగా ఒడ్డెక్కే విషయం కాదు. అధిక ధరలకు యూనిట్ ను కొనుగోలు చేశాక, ఛార్జీల వడ్డన మనకు అందించకా తప్పదు.