హుజురాబాద్ లో కనివినీ ఎరుగని రీతిలో ప్రచారం కొనసాగుతోంది. అయితే, ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అయితే, హరీష్రావు ఇతర మంత్రులు ప్రచారం చేస్తున్నా సీఎం కేసీఆర్ లేని లోటు కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ముగిసేలోగా కేసీఆర్ ఒక్క బహిరంగ సభతో కథ మారుతుందనే భావనలో ఉంది ఆ పార్టీ క్యాడర్. దీనికి దుబ్బాక ఎన్నికను గుర్తు చేస్తున్నారు. నాడు సీఎం కేసీఆర్ దుబ్బాక వెళ్లి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని అంటున్నారు.
అయితే, సభ నిర్వహించడం టీఆర్ఎస్కు పెద్ద విషయమేం కాదు. కేసీఆర్ సభకు కరోనా నిబంధనలు అడ్డుపడడంతో మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేక కూడా రాశారు. హుజురాబాద్ నియోజకవర్గం అవతల కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. అయితే, ఇదంతా చూస్తూ బీజేపీ ఉరుకోదు అంతకంటే పెద్ద సభను నిర్వహిస్తుంది. ఇప్పుడు దీనిపైనే రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హుజురాబాద్లో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భారి సభ నిర్వహించి ప్రచారానికి ముగింపు పలకాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఆ సభతో కేసీఆర్ ప్రచారానికి చెక్ పెట్టాలనేది బీజేపీ ప్లాన్. మరి ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.