పెట్రోలు ధర పెరిగింది.. డీజిలు ధర పెరిగింది. అస్సలు పెరగని ధరలు ఏంటట! వ్యవసాయంలో సంక్షోభం ఫలితంగా అక్కడ వాడే ట్రాక్టర్లకు ఇంధన వ్యయం భారం.. పోనీ రైతు బాగున్నాడా ఇంత ఖర్చు పెట్టాక అంటే అదీ లేదు. ఎందుకు సర్ ఏటా మాటలు చెప్పి మనుషులను మోసం చేస్తారు.. వ్యవసాయం బాగుంటే దేశం బాగుందని అంటారు. కానీ చట్టాలు మాత్రం అనుగుణంగా ఉండవు. కనుక మోడీని ఎవ్వరయినా నమ్మొచ్చు కానీ ఆంధ్రా ప్రజలు నమ్మరు. ఆయన అందుబాటులో ఉండే ఏ దిద్దుబాబు చర్యకూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ధరలు తగ్గితే సామాన్యుడి జీవితం కాస్తయినా కుదుట పడుతుందన్న ఆలోచనే లేదు ఆయనకు. డబ్బులున్న వారంతా ఆయనకు మద్దతు పలికితే, పేదలు మాత్రం ఆయనంటే మండిపడుతున్నారు. నెలకు ధరల భారం మూడు నుంచి ఐదు వేలకు పైగానే ఉంటోంది కొన్ని మధ్యతరగతి కుటుంబాలకు.. అప్పులు పుట్టక, ఉపాధి లేక వీరంతా అవస్థ పడుతుంటే కొత్త కొత్త పథకాలు ఏవో చెప్పి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు మోడీ.
ముంబయిలోనూ బతకలేం.. ఢిల్లీలో బతకలేం.. ఆఖరికి మారుమూల శ్రీకాకుళంలోనూ బతకలేం. బతికే హక్కు లేనే లేదు. నిలదీసే హక్కు అస్సలు లేదు. ధరలు రోజురోజుకూ పెరిగిపోతుంటే తమకేం పట్టవన్న చందంగా నాయకులు ఉంటున్నారు. బాధ్యత మరిచి విదేశీ పర్యటనలకు, వ్యక్తిగత విలాసాలకూ, కులాసాలకూ, సౌకర్యాలకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ దశలో మోడీ చెప్పే మాటలు అస్సలు ఆచరణకు తూగేలా లేవు. ఉన్న కష్టాలు చాలవన్న విధంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేశారు. సబ్సిడీ రేటు తగ్గించేశారు. ఏం చేసినా ఇదంతా దేశం కోసమే అన్న భావన ఒకటి ఆయన ప్రజల్లోకి తీసుకుపోయి, ధర్మ సంస్థాపన కోసమే తాము పనిచేస్తున్నామని అంటారు.
ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు లోటే లేదు. ఉపాధి పొందేందుకు ఉన్న అవకాశాలు అన్నీ లాక్కుంటున్నారు. ఒక జొమోటో డెలివర్ బోయ్ గా పనిచేయాలన్నా రోజుకు మూడు వందల రూపాయలు పెట్రోలుకే చెల్లించాలి. వచ్చే సంపాదన ఎంత అందులో పెట్రోలుకు వెచ్చించేది ఎంత? అయినా కూడా ఏదో ఒకటి చేసి యువత తమ పొట్ట నింపుకుంటున్నారు. చాలీ చాలని వేతనాలతోనే చిన్నా చితకా పరిశ్రమల్లో పని చేసుకుంటూ ఇళ్లకు చేరుకుని, ఈసురోమంటూ కాలం లాక్కొస్తున్నారు. దేశంలో ఇంతటి స్థాయిలో సంక్షోభం ఉంటే ఆర్థిక సంక్షోభానికి కారణాలు అనేకం అయి ఉంటే ఇవేవీ పట్టని మోడీ పాపం విదేశాలకు వెళ్లి స్పీచులు ఇస్తాడు. ప్రసంగాలు దండీగా దంచికొడతాడు. భారత్ వెలిగిపోతుందన్న భావన ఒకటి పరువు పోయినా కూడా జనాల్లోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నిస్తాడు. మరి! మోడీ సాధించిందేంటి?