రాష్ట్రంలో పాలన కు సంబంధించి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. పగ, ప్రతీకార రాజకీయాలు ఓ వైపు ఉండగా, మరోవైపు తీవ్ర ఆర్థిక సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇప్పటికీ వీటీపీఎస్, కృష్ణ పట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు ఆర్ టీపీపీ కావాల్సినంత బొగ్గు లేదనే తేలపోయింది. అయినప్పటికీ అధికారులు ఏదో ఒక విధంగా జల విద్యుత్ పై ఆధారపడే ఉత్పత్తిని తీసుకువస్తూ సరఫరాలో ఎటువంటి అంతరాయాలూ పండుగ వేళ రాకుండా ఎంతో శ్రద్ధ వహించి గండం గట్టెక్కేందుకు జగన్ కు ఎంతగానో సహకరించారు. ఇది కూడా ఓవిధంగా జగన్ కు శుభవార్తే! ఎందుకంటే పండుగల వేళ పవర్ సప్లై ఆగిపోతే నిజంగా అంతకుమించిన నరకం మరొకటి ఉండదు. పిల్లా పాపలతో పండుగ చేసుకునే వేళ ఏంటీ దరిద్రం అని జనం తిట్టుకోక మానరు. ఇదే సందర్భంలో మరో శుభవార్త కూడా జగన్ విన్నాడు. అదేంటంటే కాస్త వివరించాను చదవండిక..
విద్యుత్ సంక్షోభం రానున్నదన్న భయంతో వణికిపోతున్నాడు జగన్. పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ మాత్రం మనల్ని చూసి నవ్వుతున్నాడు. మిగులు విద్యుత్ తో దండీగా లాభాలు పొందుతున్న కేసీఆర్, మనకు మాత్రం కాస్తయినా కనికరించి విద్యుత్ అమ్మేందుకు ముందుకు రావడం లేదు. అదేవిధంగా మనకు సాయం చేయకపోగా, గతంలో చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు కూడా (వేల కోట్లలో ఉన్నాయని సమాచారం) తీర్చకుండా టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో జగన్ కు ఊరట ఇచ్చేలా ఇటీవల ఓ పరిణామం జరిగింది. అదేంటంటే పీక్ అవర్ లో యూనిట్ ఛార్జీ ధర ఇరవై రూపాయలు ఉండగా, లక్కీగా ఆరు రూపాయల 11 పైసలకే రాష్ట్ర అధికారులకు లభ్యం కావడం ఓ విశేషం. అసలే ఈసురోమంటు న్న రాష్ట్రానికి ఈ తాజా పరిణామం ఓ ఊరట. ఇదే ధర కొనసాగినా ఇంకాస్త తగ్గినా జగన్ కు ఊరటే!