ఇది ఇలా ఉండగా శశికళకు పార్టీలో చోటు లేదని అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. అమ్మ స్మారకం వద్దకు వచ్చినంత మాత్రాన శశికళకు రాజకీయ ప్రభావం ఏమి ఉండదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి జయకుమార్ వెల్లడించారు. ఇదివరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పని చేసిన శశికళను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు శశికళ రాజకీయం ఎటువైపు అని కొనసాగుతున్న ఉత్కంఠ వాతావరణ సమయంలోనే ఆమె ప్రజల మధ్యకు వచ్చారు. దేశంలోనే అతిపెద్ద బీచ్ అయిన మెరీనా బీచ్ వద్ద ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అమ్మ స్మారకాన్ని దర్శించుకున్నారు. అన్నాడీఎంకే జెండా ఉన్న కారులోంచి శశికళ దిగడం చర్చనీయాంశంగా మారింది.
జయలలిత ద్వారా లబ్ధిపొందిన వారిలో శశికళ ఒకరు. ఆమె మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం వేరే పార్టీ అయిన ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఏఎంఎంకే సరైనదని అన్నాడీఎంకే నేతలు పేర్కొన్నారు. శశికళ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చేమో కానీ తమ పార్టీలో మాత్రం శశికళకు స్థానం లేదని వెల్లడించారు.