అక్రమాస్తుల కేసు శశికళను వెన్నాడుతోంది. కానీ దీని నుంచి బయటకు వచ్చేలా చేసింది, బెయిల్ ఇప్పించింది బీజేపీనే! ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీల రగడను తనకు కలిసివచ్చేలా మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో తమిళనాట పాగా వేయవచ్చన్నది బీజేపీ ప్లాన్. ఇందులో భాగంగానే శశికళను మచ్చిక చేసుకుని, అన్నాడీఎంకేలో చీలికలు తెస్తోంది. ఆ విధంగా తెచ్చాక కీలక నేతలతో శశికళ వైరం పెంచుకున్నాక రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని బీజేపీ అత్యుత్సాహం చూపుతోంది. ఆశపడుతోంది.
దక్షిణాది రాష్ట్రాలలో తనదైన సత్తా చాటేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. నేరుగా కాకపోయినా వెనుక నుంచి అయినా పనిచేసి తన మాట నెగ్గించుకోవాలన్న తపనతో ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని పనులు చక్కబెట్టింది కూడా! దక్షిణాదిలో ఆశించిన స్థాయిలో తన వర్గం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలలో ఉన్న లుకలుకలను తనకు అనుగుణంగా మార్చేస్తోంది. ఈ క్రమంలోనే శశికళ (అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు) కు మద్దతిస్తూ, ఆమె చేతికి అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు అందేలా చేస్తోంది. ఈ విషయమై పళని స్వామి, పన్నీరు సెల్వం లాంటి నాయకులను కూడా కోటలు సైతం పడగొట్టి తన పీఠం తాను దక్కించుకోవాలని యోచిస్తున్నారు శశికళ.
వచ్చే ఎన్నికల నాటికి తాను బలపడతానని అంటున్నారు అన్నా డీఎంకే బహిష్కృత నేత, చిన్నమ్మ శశికళ. అందుకు తగ్గ కార్యాచరణ తన దగ్గర ఉందని కూడా చెబుతున్నారు. భావోద్వేగ రాజకీయాలకు పేరున్న తమిళ నాట చిన్నమ్మ కన్నీళ్లు ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయో! ముఖ్యంగా పన్నీర్ సెల్వం, పళని స్వామి లాంటి వారిని పక్కకు నెట్టి మరీ! తాను పార్టీ పగ్గాలు అందుకోనున్నానని కూడా చెబుతున్నారు. ఇంతటి కథలో అన్నా డీఎంకే మళ్లీ తన పరువు తానే పొగొట్టుకుని, శశికళకు పార్టీని చూసే అధికారం అప్పగిస్తుందా అంటే సందేహమే? కానీ బీజేపీ మాత్రం ఈ కథను తెరవెనుక ఉండి నడిపిస్తుంది. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో కానీ చిన్నమ్మ అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తే అన్నా డీఎంకేలో చీలికలు ఖాయం.