జగన్ అద్భుత విజయాన్ని అందుకున్నారు అన్న మాటే తప్ప ఎక్కడా ఆ ఆనందం లేనే లేదు. గత రెండున్నరేళ్ల పాలన చూస్తే ఎన్నో అడ్డంకులు, మరెన్నో చిక్కులు, కరోనా లాంటి మహమ్మారులు ప్రతీ వందేళ్లకు వస్తాయని అంటారు. సరిగ్గా జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా మహమ్మారి గట్టిగానే విరుచుకుపడింది. ఇది ప్రపంచ బాధ. ఎవరూ ఏమీ చేయలేరు. మరో వైపు చూస్తే ఆధికంగా ఏపీ నానా ఇబ్బందులు పడుతోంది. చేతిలో కానీ లేని ఖజానా వెక్కిస్తోంది. కేంద్రం వైపు చూద్దామా అంటే అక్కడ కూడా అదే బాధ. పైగా ఏపీ మీద కేంద్ర పెద్దలు శీతకన్ను వేశారు. ఈ నేపధ్యం నుంచి చూసుకుంటే జగన్ మ్యానిఫేస్టోని భగవద్గీత ఖురాన్, బైబిల్ అని చెప్పుకుని అమలు చేస్తున్నా ఎక్కడో అసంతృప్తి. జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగింది అన్న మాట.
కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అన్న విమర్శలు. మొత్తానికి చూసుకుంటే సగం పాలన గడిచాక వైసీపీలో కూడా గుబులు రేగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అర్ధం కావడంలేదు. మరో వైపు చూస్తే జగన్ ఎంతలా భక్తిని చూపుతున్నా కూడా విపక్షాలు ఆయన్ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు కూడా కలత పెడుతున్నాయి. దాంతో జగన్ ఈసారి చాలా భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకున్నారు. ఈసారి కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక తాజాగా శ్రీ దత్త పీఠాన్ని సందర్శించి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నదే టార్గెట్ గా జగన్ తన వ్యూహాలను అమలు చేస్తున్నారు అంటున్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ ఎపుడూ జగన్ కి దీవెనలు ఇస్తూనే ఉంటారు. ఇపుడు సచ్చిదానంద స్వామీజీ కూడా ఆయన్ని దీవించి పంపారు. జగన్ హిందూత్వ అస్త్రంతో ఇలా విపక్షాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు. మొత్తానికి జగన్ రూట్ మార్చారు. మరి విపక్షాలు గేర్ మారుస్తాయా అంటే చూడాలి.