ఇంతవరకూ మోడీ మనుషులు ఎవ్వరూ ఆయనకు ఎదురు వెళ్లి మాట్లాడడం లేదు. భయం, వణుకు, ఆందోళన కలిసి ఆయనపై మాటల దాడి చేయనీయకుండా చేస్తున్నాయి. తొలిసారి ఓ మంత్రి మా ప్రాంత ఉక్కు కర్మాగారం గురించి గొంతు వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం ఎంత తప్పో చెప్పారు. ఇప్పుడీ మాటలే సంచలనాత్మక ప్రకంపనాలు నమోదు చేయనున్నాయి. ఇంతవరకూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపై ఇంత గట్టిగా మాట్లాడిందే లేదు. భయపడుతూ, భయపడుతూ వైసీపీ పాపం ఎక్కడా మోడీనీ ఆయన పరివారాన్నీ ఏమీ అనరు. ఇంకా చెప్పుకుంటే పక్క రాష్ట్రం అన్నింటా మేలు. ఏదయినా అడిగి సాధించి తేల్చుకుంటోంది. తెచ్చుకుంటోంది. మన ఉక్కు మన హక్కు అనే నినాదంపై మీరు పోరాడడం మరువకండి మేం వెంట నడుస్తాం అని హరీశ్ రావు అనే తెలంగాణ మంత్రి కూడా మద్దతిచ్చాడు. అయినా కూడా మన ఎంపీలు మాట్లాడరే! కానీ తొలి సారి ఓ మంత్రి తన గొంతు వినిపించి ఆంధ్రుల మెప్పు పొందాడు.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. :
కేంద్ర మంత్రి ఒకరు మోడీనే ధిక్కరించి వార్తలోకెక్కారు. రామ్ దాస్ అథవాలే అనే కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ ప్రయివేటీకరణ చేయడాన్ని తప్పు పట్టారు. ఇదెంత మాత్రం స్వాగతించదగ్గ విషయం కాదని తేల్చేశారు. దీంతో ఈయన మాటలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రయివేటీకరణను అడ్డుకుంటున్న వామపక్షాలకు సైతం ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరిట జరుగుతున్న ఉద్యమానికి ఓ ఊతం దొరికిందన్న వార్త ఆంధ్రాకు చెందిన అన్ని వర్గాల్లోనూ ఆనందాలను కలిగిస్తుంది. దీంతో ఈ మాటలు విన్న వారంతా ఆ మంత్రికి అభినందనలు తెలుపుతున్నారు. ఎక్కడో మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మంత్రి తమ తరఫున మాట్లాడుతుంటే జగన్ మాత్రం అవేవీ పట్టని విధంగా ఉండడమే పెద్ద నేరమని వామపక్షాలు మండిపడుతున్నాయి.