రేపటి నుంచి పాదయాత్ర చేయనున్న నాయకురాలు వైఎస్ షర్మిల రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఆశిస్తున్నారు. నిరుద్యోగులకు కేసీఆర్ కూడా చేయని న్యాయం ఆమె ఎలా చేస్తారు ? ఇవన్నీ కొన్ని ప్రశ్నలుగానే ఉంటాయా?
తెలంగాణలో అనేక రాజకీయ శక్తులున్నాయి. ఆంధ్రాను మించిన చైతన్యం ఆ నేలపై నడయాడుతోంది. ఓయూ బిడ్డలు అంతా ఇప్పటికే కేసీఆర్ పాలనపై మండి పడుతున్నారు. ఓయూ జేఏసీ ఇప్పటికే అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక వేదికలపై కేసీఆర్ అంటే ఆగ్రహంతో ఊగిపోయింది. అంతేకాదు కొన్ని ప్రజా సంఘాలు కూడా కేసీఆర్ తో ఇవాళ లేవు. కోదండరామ్ లాంటి ఆచార్యులు కూడా బంగారు తెలంగాణ అంటే ఇది కాదని అంటున్నారు. ఆవేదన చెందుతున్నారు. కొందరు తాము బంగారు తెలంగాణ కోరుకోవడం లేదని, సామాజిక తెలంగాణ కావాలని పట్టుబడుతున్నారు. ఇదే సందర్భంలో రాజకీయ పరిణామాలను మార్చేందుకు ఉద్యమాలకు సైతం సిద్ధం అవుతున్నారు. నాది నక్సల్ అజెండా అని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా సామాజిక మార్పునకు అయితే సహకారం అందించలేదన్న మాట సంబంధిత ఉద్యమ దళాల నుంచి గళాల నుంచి వనాల నుంచి జనాల నుంచి వినిపిస్తోంది. ఇదే సందర్భంలో గులాబీ దండు మాటల యుద్ధం సిద్ధం చేసినా కూడా ఓ ప్రత్యామ్నాయ శక్తి రాజకీయ తెరపైకి రావడంలో అర్థం ఉంది. అయితే అందుకు షర్మిల సరైన నాయకురాలిగా నిలుస్తారా అన్నది ఓ పెద్ద సంశయాత్మకత.
ఇట్స్ ఎ బిగ్ డౌట్ ఫర్ ఆల్ ...
రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డి రాజకీయాల్లోకి రావడం అన్నది అనూహ్యంగా జరిగిన పరిణామం అయితే కాదు. అన్నతో ఉన్న విభేదాల కారణంగా తాను పార్టీ ప్రారంభించాను అని చెప్పడం కూడా సబబు కాదని ఎప్పుడో తేల్చేశారు. ఇక ఎందుకని ఆమె పార్టీ ఇక్కడ పెట్టారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తొలి రోజుల్లో ఆమె కేసీఆర్ వదిలిన బాణం అని అన్నారు. అంతకుము నుపు జగన్ జైల్లో ఉండగా జిల్లాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం అని తనకు తానే అభివర్ణించుకు న్నారు. కానీ ఇప్పుడు తాను ఎవ్వరి బాణాన్నీ కాదని ప్రజలు వదిలిన బాణాన్ని అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ ఏ విధంగా తన రాజకీయ పరిణామ గతిని మార్చుకోనుంది? ఏ విధంగా ప్రజలకు మంచి పాలన అందించగలను అని చెప్పబోతోంది?