ఇక హరీశ్ రావు సభలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగిన యువతిని ఇష్టం వచ్చినట్టు కొడతారా..? అని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. చివరకు ఆమెకు పిచ్చి పట్టిందని.. మెంటల్ డిజార్డర్ ఉందని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయా..? అని ఈటల నిలదీశారు.
అసలేం జరిగిందంటే.. ఉద్యోగాలపై ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని కోట నిరోష ఆరోపించింది. వీణవంకలో ధూంధాం ప్రోగ్రామ్ జరుగుతుంటే.. నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని ప్రశ్నించారని.. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు తనను కొట్టారని తెలిపింది. ఆ తర్వాత పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి.. దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో వేస్తూనే.. డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారని ఆరోపించారు. దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్ధిదారుల అకౌంట్ లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవన్నారు. ఇప్పటి వరకు ఒక్కరూ దళిత బంధు డబ్బులను వాడుకోలేదని తెలిపారు.