అయితే ఇన్నాళ్లు సైలెంట్గా, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల్లో పాల్గొనకుండా, అసలు తాను టీడీపీలో ఉన్నానో లేదో అనేలా ఉన్న గంటా శ్రీనివాసరావు.. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై బయటికొచ్చి మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో స్తబ్దుగా ఉన్న నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన క్రమంలోనే గంటా శ్రీనివాసరావు స్పందించారనీ, పట్టాభి ఇల్లు, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడుల ఘటనలు ఆయనకు కలిసొచ్చాయన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇటీవల గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రాజీనీమా చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశంలో గంటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గ్రహించారు. ఆయనతో త్వరలో సమావేశమై వైసీపీలోకి చేర్చుకోవాలనీ, దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డితో కూడా మాట్లాడే చాన్స్ ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనపై ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత, అసహనం అధికం అవుతున్నట్లు గంటా గ్రహించారనీ, అందుకే బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారనీ ఆయన అనుచరవర్గాల ద్వారా తెలుస్తోంది.