ఏపీలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా! అనే విధంగా రెండు పార్టీలూ వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ``రాజ‌కీయంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా.. ఫ‌ర్వాలేదు.. కానీ.. వ్య‌క్తిగ‌తంగా కామెంట్లు చేయ‌డం స‌రికాద‌``ని నిండు అసెంబ్లీలో వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌క‌టించారు. అయితే.. ఆ స్ఫూర్తి ఇప్పుడు కొర‌వ‌డుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయాలు అంద‌రూ చేయాల్సిందే. కానీ, దానికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. అయితే.. ఇటీవ‌ల కాలంలో నాయ‌కుల‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం.. ఫ్యాష‌న్ అయిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎంత ఎక్కువ‌గా తిడితే.. అంతగా గుర్తింపు.. మీడియాలో అంత‌గా వైర‌ల్ కావొచ్చు.. అనే ధీమా నాయ‌కుల‌కు పెరిగిపోయింది. దీంతో నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌నే వాద‌న 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి న‌వ్యాంధ్ర‌లో వినిపిస్తు న్న‌దే. అప్ప‌టి వైసీపీ నాయ‌కుడు.. జ‌గ‌న్‌ను అరాచ‌క‌వాదిగా టీడీపీ నేత‌లు పేర్కొన్నారు. ఇదే పంథాను గ‌త ఐదేళ్ల కాలంలో కొన‌సాగించారు. ఫ్యాక్ష‌నిస్టుగా పేర్కొన్నారు. ఇక‌, జ‌గ‌న్ కూడా త‌క్కువ తిన‌లేదు. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో ఆయ‌న అప్ప‌టి సీఎం చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్ప‌లేదనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఇలా.. హ‌ద్దులు మీరిన రాజ‌కీయం.. `నీ అమ్మ మొగుడు` వ‌ర‌కు చేరింది. ఆడు ఈడు అనుకోవ‌డం.. నాయ‌కుల‌కు స‌ర్వ‌సాధార‌ణంగా మారింది.

ఇక‌, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ ఎపిసోడ్‌ను తీసుకుంటే.. ఈ వ్యాఖ్య‌ల ప‌రంప‌ర‌.. `నా కొడుకుల‌` వ‌ర‌కు చేరింది. మ‌రి దీనిని నాయ‌కులు ఎంజాయ్ చేస్తున్నారా?  లేక ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఎంజాయ్ చేస్తున్నారా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. అంద‌రూ రాజ‌కీయాల్లో ఇలా దిగ‌జారిపోవ‌డం త‌గ‌ద‌ని నీతులు చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చేస‌రికి క‌మ్యూనిస్టులు కూడా క‌ట్టు త‌ప్పుతున్నారు. ఇటీవ‌లే సీపీఐ నారాయ‌ణ‌.. సీఎం జ‌గ‌న్‌ను ధ‌ర్మ‌రాజుతో పోలుస్తూ.. నాటి ధ‌ర్మ‌రాజు.. ఇచ్చి.. ఇచ్చి.. చివ‌ర‌కు భార్య‌ను అమ్ముకున్నాడు.. నువ్వు అక్క‌డి వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్దు! అంటూ.. ప‌రోక్షంగా పెద్ద‌మాటే అనేశారు. దీనిపై రాజ‌కీయంగా దుమారం రేగ‌డంతో ఎంతో కొంత విచ‌క్ష‌ణ ఉన్న నేత కావ‌డంతో సారీ చెప్పారు. స‌రిదిద్దుకున్నారు.

ఇక‌, కొన్నాళ్ల కింద‌ట టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న నేరుగా సీఎం ను నాకొడుకు.. అని సంబోధించేసి ఏం పీక్కుంటారో.. పీక్కో మంటూ.. వ్యాఖ్య‌లుచేశారు. ద‌రిమిలా.. చంద్ర‌బాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడికి య‌త్నించ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇక‌,  తాజా ఎపిసోడ్‌లో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ప్ర‌యోగించిన వ్యాఖ్య‌లు కూడా దీనికి ఏమాత్రం తీసిపోవ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌లు.. అధికారంలో ఉన్నారు క‌నుక‌.. ఒకింత సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. దూకుడు గా దాడుల‌కు పాల్ప‌డ‌డం చూస్తే.. ఈ రాష్ట్రం ఎటుపోతోంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: