వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదికి లేఖ రాసారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్‌ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి/బోయలు పేదరికంతో బాధపడుతున్నారు అని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి అని వెల్లడించారు. 2016లో, ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకీ/ బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.

విస్తృతమైన ఫీల్డ్ వర్క్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు చేసిన వివరణాత్మక పరిశోధన తర్వాత, వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంలో జాప్యం జరిగిందని కమిటీ గుర్తించింది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటించి వాల్మీకులు/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది అని పేర్కొన్న చంద్రబాబు నాయుడు... వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అని వెల్లడించారు. 1961 లో, సెన్సస్ కమిషన్ కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ రాయ్ బర్మన్ వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేశారు అని వివరించారు.

1961-62లో, ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఎన్క్వయిరీ కమిషన్ వాల్మీకి/బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని సూచించింది అని తరువాత అనంతరామ కమిషన్ అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ, వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు అని పేర్కొన్నారు. రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రలోని వాల్మీకి/బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని వెల్లడించారు. 1968 లో, వాల్మీకులు/బోయలను ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు అని వివరించారు. దురదృష్టవశాత్తు, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకులు మాత్రమే ఎస్టీ జాబితాలోకి వస్తారని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 1977 జూలై 27 న ఉత్తర్వులు జారీ చేసింది అని లేఖలో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: