తమది దేవుడి పాలన అంటారు వైఎస్ జగన్. అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తానని కూడా చెబుతారు. ఇవన్నీ బాగానే ఉన్నా పాలనలో గాడి తప్పిన వైనంతో మాత్రం తనకేం సంబంధం లేదన్న విధంగానే ఉంటారు. ముఖ్యంగా మంత్రుల వైఖరులు మారకున్నా, పథకాల అమలు బాగోకున్నా అస్సలు ఆయన పట్టించుకోరు అన్న విమర్శలోనే ఉన్నారు. ఆ విమర్శను రద్దు చేసి, బాగా పనిచేయాలన్న తపన అయితే మాత్రం ఆయనలో లేదనే తేలిపోయింది అని అంటున్నాయి టీడీపీ వర్గాలు. తిట్టుకోవడం, విమర్శించుకోవడం తీరు ఎలా ఉన్నా కూడా జగన్ తనదైన పాలన పూర్తి స్థాయిలో అందించడం లేదని తేలిపోయింది. నాన్న వైఎస్ అందించిన పాలనకూ, ఈయన పాలనకూ చాలా తేడా ఉందనే కొన్ని అభిప్రాయలు వస్తున్నాయి. తండ్రి హయాంలో అనుభవించిన అధికారం తరువాత తాను పొందిన అధికారం కాస్త ఎక్కువే అన్న భావనలో ఆయనలో ఉందో లేదో కానీ పాలన మాత్రం బాలేదు అన్న మాట కు మాత్రం ఎవ్వరూ అంగీకారం ఇచ్చేలా లేరు. అందుకే ఎవ్వరు మాట్లాడినా కోపంతో ఊగిపోతున్నారు. ఆవేశంతో తమదైన ప్రకటనలేవో చేస్తున్నారు.
ముఖ్యంగా లక్ష కోట్లు పేరిట చేపడుతున్న సంక్షేమం ఎలా ఉన్నా సంబంధిత నిర్వహణ బాగోకున్నా, గతంలో కన్నా ఇప్పుడే ఆర్థిక పరిస్థితి దివాళా తీసినా వీటిపై జగన్ దగ్గర ఎవ్వరూ నోరెత్తకుండా ఉంటే బెటర్. గంజాయి సాగుకు సంబంధించి విశాఖ మన్యంలో ఏర్పడిన పరిస్థితులకు సంబంధించి నియంత్రించాల్సిన పోలీసులు తరుచూ విఫలం అవుతున్నారన్నది టీడీపీ విమర్శ. కానీ వీటిపై మాట్లాడాల్సిన సమయంలో అధికార పార్టీ మాట్లాడకుండా కేవలం తప్పిదాలను దాటి వేసే ప్రయత్నంచేస్తుందని టీడీపీ అంటోంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనాలకు కారణం అయిన గంజాయి వ్యవహారంపై పోలీసులు ఎంతగా నియంత్రిద్దాం అనుకున్నా అవి రాష్ట్రం సరిహద్దు దాటి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల పోలీసులు ఇక్కడికి వచ్చి మరీ! సోదాలు చేస్తూ స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు పెను సంచలనాలకు తెరలేపింది. టీడీపీ కూడా ఇవే విషయాలు పట్టుబడుతోంది. మన మన్యం ప్రాంతంలో నిఘా వ్యవస్థ లోపం కారణంగానే ఇలాంటివి చోటుచేసు కుంటున్నాయని టీడీపీ అంటోంది.అయితే వీటిపై తాము దృష్టి సారించామని, తరుచూ మన్యం ప్రాంతంపై నిఘాను పెంచామని జగన్ వర్గాలు చెబుతున్నా, అవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడం లేదని టీడీపీ అంటోంది.