అయితే తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైయస్ షర్మిల అటు సీఎం కేసీఆర్ వదిలిన బాణం అన్న ఒక టాక్ కూడా మొదటి నుంచీ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ షర్మిల మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఎన్నో సార్లు విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయింది అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక ఇటీవలే చేవెళ్లలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన వైయస్ షర్మిల కెసిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ రాలేదు కానీ బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ గా మాత్రం మార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు వైయస్ షర్మిల. రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై దాడులు పెరుగుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ఆరేళ్ళ చిన్నారి మాణ, ప్రాణాలకు కూడా రాష్ట్రంలో రక్షణ లేదు అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ఉరివేసుకుని చచ్చిపోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.