ఇంకా ఏపీలో మీడియా పని ఇదే. మరి న్యూట్రల్ మీడియా ప్రజలకు పెద్దగా కనిపిస్తున్నట్లు లేదు. ఒకవేళ అలాంటి మీడియా ఉన్నా సరే..రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా తిప్పేసుకుంటాయి. ఈ మీడియా సంస్థల వల్ల ప్రజలకు నిజనిజాలు సరిగా తెలియడం లేదు. ఒకే అంశంపై...టిడిపి అనుకూల మీడియా ఒకలా, వైసీపీ అనుకూల మీడియా మరొకలా చూపిస్తుంది. దీంతో టిడిపికి అనుకూలమైన వారు...టిడిపి అనుకూల మీడియాని నమ్ముతున్నారు. అటు వైసీపీకి అనుకూలమైన వారు....వైసీపీ అనుకూల మీడియా చెప్పే వాటిని నమ్ముతున్నారు.
తాజాగా ఏపీలో జరుగుతున్న ఘటనలని కూడా ఎవరికి వారు....తమ ఇష్టమైన రీతిలో చూపించుకుంటున్నారు. టిడిపి నేత పట్టాభి...డ్రగ్స్, గంజాయి విషయంలో మాట్లాడుతూ జగన్ని దూషించారు...ఆ దూషణకు నిరసనగా వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి చేశాయి. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయం జనాలకు అర్ధమవుతుంది.
కానీ మీడియా సంస్థలు అలా చూపించడం లేదు...టిడిపి అనుకూల మీడియా పట్టాభి తిట్టిన అంశాన్ని హైలైట్ చేయకుండా, వైసీపీ వాళ్ళు...టిడిపి ఆఫీసులపై దాడులు చేసింది మాత్రమే తెగ చూపిస్తుంది. ఇక వైసీపీ అనుకూల మీడియా మరొకలా ఉంది. పట్టాభి తిట్టడాన్ని హైలైట్ చేస్తూనే, అసలు టిడిపి ఆఫీసుల వద్ద వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే...టిడిపి వాళ్లే దాడులు చేశారని, వాళ్లే టిడిపి ఆఫీసులని ధ్వంసం చేసుకున్నారని, వాళ్ళని వాళ్లే కొట్టుకుని వైసీపీ కార్యకర్తలపై నెపం నెట్టేస్తున్నారని చెబుతోంది. అసలు జగన్తో సహ వైసీపీ నేతలు...తమ కార్యకర్తలు ఆవేశానికి లోనై దాడులు చేశారనే విధంగానే చెబుతున్నారు. అయినా సరే వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వేరు. ఇటు టిడిపి అనుకూల మీడియాలో వేరే కథ. మొత్తానికి ఈ అనుకూల మీడియా సంస్తలంతా వరెస్ట్ ఇంకేమీ లేవనే చెప్పాలి.