ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టు కింద దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 9.90 లక్షలు వారి అకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకం కేవలం ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. రాష్ట్రం మొత్తం దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో మరో నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. హుజురాబాద్ ఎన్నికపై దళిత బంధు పథకం ప్రభావం చూపుతుందని గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫోరమ్ కన్వీనర్ పద్మనాభ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే లేఖ రాసిన రెండు నెలల తర్వాత.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. దళిత బంధు ఆపాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
దళిత బంధును ఆపాలన్న ప్రకటన తర్వాత బీజేపీ,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. దళిత బంధుపై బీజేపీ కుట్ర చేసిందని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. దళితుల పట్ల వ్యతిరేకతను బీజేపీ మరోసారి బయట పెట్టుకుందని ఫైర్ అవుతున్నారు. హుజురాబాద్లో మోదీ, ఈటల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరోవైపు దళిత బంధు పథకం ఆగిపోవడానికి కేసీఆరే కారణం అని బీజేపీ నాయకులు కూడా మండి పడుతుండగా... బీజేపీ నేతల ఫిర్యాదు వల్లే దళితులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద పది రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంలో దళిత బంధు నిలిపివేత ప్రకటన అగ్గి రాజేసింది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.