జగన్ కూ, చంద్రబాబుకూ మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. వాటిపై ఇరు వర్గాలూ ఎప్పటికప్పుడు వాగ్యుద్ధాలనేవి చేస్తూనే ఉంటాయి. అదేవిధంగా జగన్ వర్గం చంద్రబాబుపై దూకుడుతో నాలుగు మాటలు అన్న రోజులూ ఉన్నాయి. జగన్ లానే చంద్రబాబు కూడా అవమానాలు చూశారు. అయితే చంద్రబాబు మరింత చాకచక్యంతో వ్యవహరించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో టీటీడీ అధినేత చంద్రబాబు చేస్తున్న పోరాటంలో పదో వంతు కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం లేదు అన్నది ఓ విమర్శ. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ప్రజా పోరాటాలే పరమావధి అని బతకాలని అధినేత చెప్పినా కూడా వినని స్థితిలో కొందరు తెలుగు తమ్ముళ్లు, నాయకులు ఉండడం శోచనీయం. ఈ క్రమంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అన్నది జరగని పని.
అధికారం ఉన్నా కోల్పోయినా ఓ నాయకుడు జనం మధ్యలో ఉండాలి అన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సూత్రం. ఇదే సూత్రాన్ని ఆయన కొడుకు జగన్ పాటించి సక్సెస్ అయ్యారు. అధికారం లేకపోయినప్పటికీ ప్రజల మధ్య నిరంతరం ఉంటూ, వారి బాధలు వింటూ, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అప్పట్లో జగన్ పూర్తి స్థాయి నాయకుడిగా మారిపోయారు. అప్పట్లో జగన్ ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించేవారు.
టీడీపీ వైఫల్యాలపై రోడ్డెక్కి తన గొంతుక వినిపించి, ప్రజా దీవెన, మన్నన పొందారు. ఇవేవీ ఎవ్వరూ కాదనరు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. చంద్రబాబు విపక్ష నేతగా ఉంటూ పలు సమస్యలపై రోడ్డెక్కుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ప్రజల సమస్యలు వినిపించి సత్తా చాటుకుంటున్నారు. వివిధ స్థాయిలలో క్షేత్ర స్థాయిలో సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. చేయిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నంత కమిట్ మెంట్ మిగతా నాయకులకు లేదు. ఆయనకు ఉన్న డెడికేషన్ మిగతా నాయకులకు లేదు. దీంతో తరుచూ టీడీపీ ఇబ్బందుల పాలవుతోంది. అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.