ఎవరు తప్పులు చేసినా ఇంకొకరు ప్రశ్నించాలి. ఎవరు మంచి చేసినా ఇంకొకరు ప్రశంసించాలి. అధికారం పేరిట ఎవ్వరూ ఎవ్వరిపైనో పెత్తనం చెలాయించకూడదు. అధికారం ఉందన్న గర్వంలో ఎవరూ ఎవరిపై ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. దురదృష్టం ఏడున్నరేళ్లుగా ఆంధ్రావనిలో అదే జరుగుతోంది. ఒకరు అధికారం పేరిట దౌర్జన్యాలు చేస్తే, ఇంకొకరు కూడా అదే బాటలో ఉన్నారు. చింతమనేని తిడితే, అబ్బయ్య చౌదరీ తిడతానని అంటున్నారు. లేదా కొడాలి నాని తిడితే ఇంకొకరెవ్వరూ అదే స్థాయిలో తిడతారు. సొంత ఆలోచనలు లేని కారణంగా నాయకులు ఒకరి పద్ధతులను ఇంకొకరు అనుకరిస్తున్నారు. లేదా అనుసరిస్తున్నారు. ఇదెంత మాత్రం మంచిది కాదు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ పోలీసు యంత్రాంగం తీరుకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేస్తానని చెప్పడమే ఇప్పటి అసలు చర్చకు కారణం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన హయాంలో చేయాలనుకున్నవన్నీ దీక్షల సమయంలో చెప్పారు. అధికారంలో ఉన్న రోజు కన్నా అధికారం లేని రోజే జగన్ చాలా బాగున్నారు. ప్రజలతో కలిసి పోయి ప్రజా బలం పొంది ఉన్నారు. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా జనం మధ్య కు రావడం లేదు. అధికారం ఉందన్న సాకుతో చాలా చాలా తప్పులు చేస్తున్నారు.ఏమయినా ప్రశ్నిస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు. కానీ తాము ప్రజా స్వామ్య విలువలను కాపాడేందుకే ఉన్నామని చెబుతున్నారు జగన్. ఇదొక్కటి అత్యంత నమ్మశక్యంగా లేని విషయం.
ఎందుకంటే అధికారంలో లేనప్పుడు చంద్రబాబు పై పోరాడారు. ఉన్నప్పుడు సమస్యల పరిష్కరించి చంద్రబాబు కన్నా మంచి నాయకుడ్ని తానే అని నిరూపించుకోవాలి. చేతగాకపోతే తప్పు కోవాలి లేదా తప్పు ఒప్పుకోవాలి అన్న తరహాలో ఆ రోజు జగన్ అనే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చిమ్మారు. ఇవన్నీ పరిగణనలో ఉంచుకుని ఇప్పుడు చంద్రబాబు అదే దారిలో వెళ్లనున్నారు. చాలా కాలం తరువాత రాష్ట్రంలో దీక్షల శకానికి తెరలేపారు చంద్రబాబు. అధికార పార్టీ తీరుకు నిరసనగా 36 గంటల నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు బాబు.