దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇక ఇప్పుడు దళిత బంధు ఇవ్వకుండా నిలిపివేసిందని.. ఏంటి అని అడిగితే ఏదో ఒక కారణాలు చెబుతుంది అంటూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అదేసమయంలో ఈటెల రాజేందర్ కారణంగానే అటు హుజురాబాద్ లో దళిత బందు ఆగిపోయింది అంటూ టిఆర్ఎస్ నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన బిజెపి లీడర్ మాజీమంత్రి బాబు మోహన్ అటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.
దళిత బంధును హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ నిలిపివేసినట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలి అంటూ హితవు పలికారు మాజీ మంత్రి బీజేపీ లీడర్ బాబు మోహన్ . ఈటెల రాజేందర్ దళిత బంధు నిలిపివేసినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుని నియోజకవర్గం మొత్తం తిరుగుతాను అంటూ సవాల్ విసిరారు బాబు మోహన్. ఒకవేళ నిరూపించుకో పోతే మీరు గుండు కొట్టించుకొని నియోజకవర్గం మొత్తం తిరగడమే కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అంటూ ప్రశ్నించారు బాబు మోహన్. కాగా బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.