అయితే తాజాగా రాపాక వరప్రసాద్ మళ్ళీ వార్తల్లోకెక్కారు. వైసీపీ నేతలు చేస్తున్న జనాగ్రహ దీక్షల్లో ఆయన నేరుగా పాల్గొన్నారు. వైసీపీ కండువా కప్పుకొని మరీ స్లోగన్లు ఇచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. అయితే ఆయన ఇప్పుడిలా వైసీపీ కండువా కప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది. వరప్రసాద్ ఇప్పటివరకూ వైసీపీలో చేరలేదు. అధికారికంగా పార్టీ మారనూలేదు. అయితే పార్టీ మారకపోయినా జగన్ కు మద్దతు ప్రకటించారు. వైసీపీలో ఎమ్మెల్యేల మాదిరిగానే పనిచేస్తున్నారు. అయితే పార్టీ మారకుండా, ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటే.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రాపాకపై అనర్హత వేటు పడుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రాపాక చేసిన ఈ చిన్నతప్పు కారణంగా, ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టయింది. గతంలోనూ పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామని సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ నిబంధన కారణంగానే ఆయనకు ఇప్పటివరకూ వైసీపీ కండువా కప్పలేదు. అధికారికంగా పార్టీలోకి తీసుకోనూలేదు. రాపాక అత్యుత్సాహంతో చేసిన ఈ పని, ఆయనకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాపాక వైసీపీ కండువా కప్పుకొని దీక్షలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తమను దెబ్బకొట్టిన రాపాకపై ప్రతీకారం తీర్చుకుందుకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా పార్టీ మారకుండా ఇలా చేసినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కండువా మార్చినందుకే అనర్హత వేటు వేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.