తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టాయి. రెండేళ్ల పాటు ఉండే పదవి కోసం... అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ తరఫున ముఖ్యనేతలంతా రంగంలోకి దిగారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు కూడా. హుజురాబాద్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ మరో రెండు రోజుల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు నెత్తిన పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరాలని... సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ కంకణం కట్టుకుని ఉన్నారు.
అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికల వాతావరణం ఎక్కడ కనిపించటం లేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ... ఆయా పార్టీల తరఫున రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ ప్రచారం చేయడం లేదు ఇంకా చెప్పాలంటే... ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలను అన్ని పార్టీలు లైట్ తీసుకున్నాయి. ఎలాగూ మా అభ్యర్థే గెలుస్తారంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రచారం చేస్తున్న దాఖలాలు కూడా కనిపించటం లేదు.