హుజురాబాద్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకువెళ్తున్నా.. ఓ విషయం మాత్రం రాజకీయాల్లో, జనాల్లో చర్చగా మారింది. అదే సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడవేయించే పనిలో పడ్డారని. హుజురాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేమని, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసినా ఓటమిని ఆపలేమని తెలుసుకున్న కేసీఆర్ బైపోల్ వాయిదా వేసేందుకు చూస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంత్రిభద్రతల సమస్యను తీసుకువచ్చి ఉప ఎన్నికను వాయిదా వేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బండి.
హుజురాబాద్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని కమల నేతలు రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. ఇలాంటి స్ట్రాటజీనే మొన్న గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జరిగిందని ఉదాహరణలు చెప్పారు బండి. ఓటుకు 20 వేలు పంచడానికి విఫలమవుతుండడంతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు బండి.
20 ఏళ్లుగా హుజురాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటలకు అక్కడ గట్టి పట్టు ఉంది. అలాగే తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పాదయాత్ర నిర్వహించారు ఈటల. దీంతో గులాబీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని అంటున్నారు కమలం నేతలు. హుజురాబాద్ టీఆర్ఎస్కు సేఫ్ కాదనే హుజురాబాద్ పరిధిలో టీఆర్ఎస్ సభ నిర్వహించలేదంటున్నారు. దీనిపై టీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తూ ఖండిస్తోంది. మరి పోలింగ్ దగ్గర పడుతుండడంతో పొలిటికల్ పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి.