రాష్ట్రంలోని హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. బరిలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. టిఆర్ఎస్,కాంగ్రెస్,బిజెపి కి కత్తి మీద సాములా తయారైంది. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన ఎన్నిక ఇదేనంటూ చెబుతున్న వారూ లేకపోలేదు. ఈ ఉప ఎన్నిక పై గులాబీ సర్కారు ఓ కన్నేసింది. ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ పార్టీలోని అంతర్గత వ్యవహారాలు,ఎన్నిక గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తదితర అంశాలై ఆరా తీస్తున్నది. ఈ సందర్భంగా అనేక వినూత్న విషయాలు, భిన్నాంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. రాజకీయ కప్పగంతుల మూలంగా ఆశించిన ప్రయోజనం టీఆర్ఎస్ కు కలగలేదని వినికిడి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి తో గులాబీ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి పంపిన నివేదికలో స్పష్టం ఇచ్చినట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి ఎన్నికల్లో ఓట్ల పండుగ చేసుకోవాలనుకున్న అధికార పార్టీకి కళ్లుచెదిరే సంగతులు వేగుల ద్వారా అందినట్టు తెలంగాణ భవన్ వర్గాలే సెలవిస్తున్నాయి. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే సంగతిని వాయిదా వేసినట్టు సమాచారం.

మరో ముఖ్యమైన విషయం ఈటెల రాజేందర్ ఏదైతే ఆశించి బీజేపీలో చేరారో అది నెరవేరకపోవడం గమనార్హం. ఆ పార్టీ పంచన చేరి అదనపు ఓట్లను సాధించడం ద్వారా హుజురాబాద్లో విజయబావుటా ఎగురవేయాలని భావించిన మాజీమంత్రి కి దిమ్మ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేందర్ వ్యక్తిగత పలుకుబడి మూలానే ఆయనకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది తప్ప, బీజేపీతో కాదని ఇంటెలిజెన్స్ సర్కారుకు పంపిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది . బిజెపి లో ఉన్న గ్రూపుల మూలంగా రాజేందర్ తల బొప్పికడుతోందని  సమాచారం. ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేయడం తప్ప ఆ పార్టీ నేతల ద్వారా ఈటల కు లబ్ధి చేకూరే పరిస్థితులు లేవని ఒకవేళ ఉన్నా అవి చాలా తక్కువ అని సర్కార్ వేగుల  అభిప్రాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గ్రూపులతో ఈటల కు ప్రచార పర్వం సందర్భంగా ప్రతి రోజు పరీక్షే అవుతున్నదని సమాచారం. ఇదిలా ఉండగా సర్కారీ వేగులు మరో కొత్త ప్రయోగం చేసినట్టు సమాచారం. టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పనితీరు, కులాల వారిగా సమీకరణాలు,పార్టీలో ఉండి ఈటల రాజేందర్ కు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రచారాన్ని వదిలేసి తిరుగుతున్న నేతల గురించి సైతం ఆరా తీసినట్లు తెలిసింది టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్,కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ సొంత వ్యూహాల కన్నా పార్టీ అధినాయకత్వం ఆదేశాల అమలు కే పరిమితం అవుతున్నట్టు సమాచారం.

ఎన్నికల నోటిఫికేషన్ కు ముందున్న రాజకీయ పరిస్థితి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అంచనా. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటి తీవ్రమైందని, రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని, ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొడంగల్ ఎన్నిక మాదిరిగానే హుజూరాబాద్ నియోజకవర్గం లోనూ ఒక్కరోజులోనే ఫలితం మారిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: