టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.. తన బృందంతో రాష్ట్ర పతిని కలవబోతున్నారు. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని.. రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పబోతున్నారు. పనిలో పనిగా కొందరు కేంద్ర పెద్దలను కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ చంద్రబాబు డిల్లీ యాత్ర ఏమైనా ఫలితాలు ఇస్తుందా.. పార్టీకి ఏమైనా ఉపయోగడుతుందా అన్నది మాత్రం సందేహాస్పదమే.


చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలవడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ఏపీకి జరిగే మేలు సంగతేమో కానీ.. రాష్ట్రం పరువు కాస్తా పోవడం.. నవ్వుల పాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. టీడీపీ డిమాండ్.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్.. ఎందుకంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు కాబట్టి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి కాబట్టి అని చెబుతున్నారు.


ఇక్కడ ఓ కీలక విషయం గమనించాలి.. ఏపీలో కేవలం దాడులు మాత్రమే జరిగాయి. కానీ.. బెంగాల్‌లో ఏకంగా హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయి. అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలమీద.. అక్కడ గవర్నర్ కూడా బీజేపీకి చెందిన వ్యక్తే.. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో దారుణమైన హింస జరిగింది. దీనిపై చాలా వివాదం కూడా అవుతోంది. ఇంత జరుగుతున్నా.. కేంద్రం బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించలేదు.


రాష్ట్రపతి పాలన అన్నది అంత సింపుల్‌గా పెట్టే వ్యవహారం కాదు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలు చేసే పరిస్థితి లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధిస్తారు. మరి బెంగాల్‌లోనే ఏమీ చర్యలు తీసుకోలేని కేంద్రం.. ఏపీలో టీడీపీ ఆఫీసులపై దాడుల అంశంపై హుటాహుటిన చర్యలు తీసుకుంటుందా.. టీడీపీ డిమాండ్ చేసింది కదా అని రాష్ట్రపతి పాలన విధిస్తుందా.. అదేమీ జరిగే పని కాదు.. కాకపోతే.. దాడుల అంశాన్ని మరికొంత రాజకీయ మైలేజీ కోసం వాడుకోవడం.. అంతకుమించి టీడీపీ సాధించేదేమీ కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: